సస్పెండయిన ఎంపీలకు గాంధీజీ వివేకం ప్రసాదించాలి : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-12-01T18:42:17+05:30 IST

సస్పెండయిన రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని

సస్పెండయిన ఎంపీలకు గాంధీజీ వివేకం ప్రసాదించాలి : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : సస్పెండయిన రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నారని, వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని గాంధీజీని తాను ప్రార్థిస్తున్నానని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. ఈ ఎంపీలు సభకు రావాలనుకుంటే, ముందుగా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలన్నారు. వారిని ధర్నా చేయనివ్వండన్నారు. వారికి మంచి బుద్ధిని, వివేకాన్ని ప్రసాదించాలని గాంధీజీని ప్రార్థిస్తున్నానని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. 


అంతకుముందు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, సస్పెండయిన ఎంపీలు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదన్నారు. సభలో వారి ప్రవర్తన పట్ల విస్మయం వ్యక్తం చేశారు. వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరించే ప్రసక్తే లేదన్నారు. 


పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మూడో రోజు అయిన బుధవారం కూడా రాజ్యసభలో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. 12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ, నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించాయి.  ప్రతిపక్ష ఎంపీల మాటలను రికార్డుల్లో చేర్చవద్దని, వెల్‌లో వారి ప్రవర్తనను దేశ ప్రజలకు చూపించాలని వెంకయ్య నాయుడు ఆదేశించారు. 


ఆగస్టులో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఈ పన్నెండు మంది సభ్యులు అనుచితంగా ప్రవర్తించినందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వారిని సస్పెండ్ చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 23 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. 


Updated Date - 2021-12-01T18:42:17+05:30 IST