ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధం: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2022-04-26T18:00:40+05:30 IST
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లా: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజల మద్దతు టీడీపీకే ఉందన్నారు. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ఏపీ మరో శ్రీలంక అవుతుందన్నారు. వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ 160 స్థానాలు గెలుస్తుందని, మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతారని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులు చిత్తు కాగితాలతో సమానమని అన్నారు. విజయవాడ ప్రభుత్వ హాస్పటల్లో యువతిపై మూడు రోజులు అత్యాచారం జరిగితే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎవరూ రాక పోతే బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారన్నారు. చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాల కంటే జగన్ చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి మోస పూరిత పథకమని, సీఎం జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఆయన పతనం ప్రారంభమైందన్నారు. పవన్ కల్యాణ్కు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతున్నారని, పవన్ను ఎదుర్కోలేక దత్తపుత్రుడని ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.