రాహుల్ గాంధీపై మరోసారి విరుచుకుపడ్డ ప్రశాంత్ కిశోర్

ABN , First Publish Date - 2021-12-02T21:22:24+05:30 IST

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కాంగ్రెస్

రాహుల్ గాంధీపై మరోసారి విరుచుకుపడ్డ ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆ పార్టీ నాయకత్వమనేది దైవదత్త హక్కు కాదని గట్టిగా చెప్పారు. ప్రతిపక్ష నేతను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించాలని పిలుపునిచ్చారు. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. 


ప్రశాంత్ కిశోర్ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యంవహిస్తున్న భావజాలం, వేదిక చాలా ముఖ్యమైనవి. కానీ కాంగ్రెస్ నాయకత్వం అనేది ఓ వ్యక్తికిగల దైవదత్త హక్కు కాదు, మరీ ముఖ్యంగా గడచిన పదేళ్ళలో జరిగిన ఎన్నికల్లో 90 శాతం ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో. ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించాలి’’ అని పేర్కొన్నారు. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో టీఎంసీ ప్రచార వ్యూహాలను రచించిన ప్రశాంత్ కిశోర్ మమత బెనర్జీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీపై తరచూ విరుచుకుపడుతున్నారు. మమత బెనర్జీ బుధవారం మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించారు. యూపీఏ ఉనికిలో లేదన్నారు. రాహుల్ గాంధీపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయన విదేశీ యాత్రలకు వెళ్తుండటాన్ని దుయ్యబట్టారు. సగం కాలం విదేశాల్లో ఉంటూ ఎవరూ రాజకీయాలు చేయలేరన్నారు. అంతకుముందు ఆమె ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ముంబైలో భేటీ అయ్యారు. 


టీఎంసీని గోవా, మిజోరాం తదితర రాష్ట్రాలకు విస్తరించే వ్యూహాలను ప్రశాంత్ కిశోర్ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా తదితర శాసన సభలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.


Updated Date - 2021-12-02T21:22:24+05:30 IST