అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-01-03T18:22:39+05:30 IST
ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్ర శాసనసభ సమావేశాలు గవర్నర్ కేఎన్ రవి ప్రసంగంతో ఈ నెల 5వ తేదీన ప్రారంభం కానున్నాయి.
ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు
ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేస్తున్న దృశ్యం
చెన్నై/ప్యారీస్, జనవరి 2: ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్ర శాసనసభ సమావేశాలు గవర్నర్ కేఎన్ రవి ప్రసంగంతో ఈ నెల 5వ తేదీన ప్రారంభం కానున్నాయి. కొత్త ఆంక్షలతో కరోనా లాక్డౌన్ నిబంధనలు అమలుకు రావడంతో ఈ సమావేశాలు సెయింట్ జార్జి కోట ప్రాంగణంలో కాకుండా అన్నాసాలైలోని కలైవానర్ అరంగంలో నిర్వహించనున్నట్లు శాసనసభ కార్యదర్శి శ్రీనివాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒమైక్రాన్ రాష్ట్రంలో అధికమవుతున్న కారణంగా సెయింట్ జార్జి కోటలోని అసెంబ్లీలో జరపాలని తొలుత నిర్ణయించిన సమావేశాలను కలైవానర్ అరంగంలోకి మార్చారు. కరోనా ప్రభావం వల్ల గత రెండేళ్లుగా శాసనసభ సమావేశాలకు కలైవానర్ అరంగం వేదిక కావడం గమనార్హం. గత వార్షిక బడ్జెట్లాగే ఈసారి కూడా పేపర్ వినియోగించకుండా డిజిటల్ విధానం అమలుచేయడంతో ప్రస్తుతం ఒక్కొక్క శాసనసభ్యుడు కుర్చీలో కంప్యూటర్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ సమావేశాలకు కలైవానర్ అరంగం ప్రత్యేక అంశాలతో ముస్తాబవుతోంది.
5వ తేది... : కలైవానర్ అరంగం 3వ అంతస్తులో ఉన్న ఆడిటోరియంలో ఈ నెల 5వ తేది ఉదయం 10 గంటలకు నూతన సంవత్సరం తొలి శాసనసభ సమా వేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో పాల్గొనే ఎమ్మెల్యేలు, పాత్రికేయు లు, ఫొటోగ్రాఫర్లు, అసెంబ్లీ సిబ్బంది తదితరులకు ఆదివారం ఉదయం ఆరోగ్యశాఖ అధికారులు కలైవానర్ అరంగంలోనే కరోనా పరీక్షలు నిర్వహిం చారు. కాగా, ఎమ్మెల్యేలు నివసిస్తున్న వారి సొంత జిల్లాల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక సదుపాయం కల్పించారు. శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న దానిపై సభా వ్యవహారాల కమిటీ సమావేశమై నిర్ణయిస్తుందని అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ తెలిపారు.