దశలవారీ పోరాలకు సిద్ధమవండి
ABN , First Publish Date - 2021-12-03T07:35:03+05:30 IST
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని ఉద్యోగులకు ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ కేవీ రాఘవులు పిలుపునిచ్చారు.
ఉద్యోగులకు ఏపీ జేఏసీ పిలుపు
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 2: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని ఉద్యోగులకు ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ కేవీ రాఘవులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎన్జీవో భవనంలో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పీఆర్సీ అమలులో ప్రభుత్వానికి అలసత్వం తగదన్నారు. ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ఓవైపు విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 10వ తేదీవరకు కార్యాలయాలు, పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని చెప్పారు. 10న భోజన విరామ సమయంలో నిరసనలు, 13న తాలూకా స్థాయిలో నిరసన ప్రదర్శనలు, 16న ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నాలు, 21న జిల్లాస్థాయి పోరాటంలో భాగంగా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు. నాయకులు ముత్యాలరెడ్డి, అన్వర్ బాషా, కడియాల మురళి, రఘు, గంటా మోహన్, నాగరాజు, సభాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.