పుష్కరిణి.. జలతరంగిణి!
ABN , First Publish Date - 2021-03-01T09:58:05+05:30 IST
లక్ష లీటర్ల నీళ్లతో కళకళలాడే గుండం. మూడు వైపులా చక్కని మెట్లు.. స్నానఘట్టాలు..
యాదాద్రి క్షేత్రంలో విష్ణు పుష్కరిణి సిద్ధం
గుట్ట కింది నుంచి నీటి పంపింగ్.. భక్తుల స్నానాలు
యాదాద్రి టౌన్, ఫిబ్రవరి 28: లక్ష లీటర్ల నీళ్లతో కళకళలాడే గుండం. మూడు వైపులా చక్కని మెట్లు.. స్నానఘట్టాలు.. మధ్యలో కృష్ణరాతి శిల్ప సంపదతో కనువిందు చేసే తెప్పోత్సోవ మండపం! ఇదీ యాదాద్రి క్షేత్రం వద్ద నిర్మించిన విష్ణు పుష్కరిణి వైభవం!! ఇక్కడి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన ఈశాన్యంలో నిర్మించిన విష్ణు పుష్కరిణి నిర్మాణం పూర్తయి జలకళను సంతకరించుకుంది. సుమారు రూ.3.5 కోట్ల వ్యయంతో ఆర్సీసీ, శిల్ప నిర్మాణాలతో పుష్కరిణి నిర్మాణం పూర్తయింది. మూడు మీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పుతో తెప్పోత్సవ మండపం, పుష్కరిణి ఈశాన్య దిశలో ట్రీట్మెంట్ ప్లాంట్, తూర్పు దిశలో డ్రెస్ చేంజ్, స్నానపు గదులను నిర్మించారు. పుష్కరిణిలోకిగుట్ట కింది నుంచి శనివారం నీటిని పంపింగ్ చేశారు. పుష్కరిణి జలసిరితో కళకళలాడటంతో క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులు ఆదివారం పుణ్యస్నానాలు చేశారు. ఆధ్యాత్మిక, పురాణ ప్రాశస్త్యంగల పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.