ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాల అందజేత
ABN , First Publish Date - 2021-07-26T05:32:06+05:30 IST
ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాల అందజేత
వికారాబాద్ (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో విశేష కృషిచేసిన వికారాబాద్ వాసి, వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ ఆదివారం తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సి.పార్థసారధి చేతుల మీదుగా ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం-2021 అందుకున్నారు. అదేవిధంగా కెరెళ్లి గ్రామానికి చెందిన తలారి సంజీవ్, జైదుపల్లి గ్రామానికి చెందిన బేగరి రాములు అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో పుడమి సాహితీ వేదిక, త్యాగరాయ గానసభలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి పార్థసారధి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్య, సాహిత్య, సామాజిక, కళలు, వ్యవసాయం, తదితర రంగాల్లో విశేష కృషిచేసిన వారందరికీ ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. కాగా విద్యారంగంలో శ్రీనివాస్, సాహితీ రంగంలో సంజీవ్, గేయ రచయితగా రాములు సేవలందిస్తున్నారు. పుడమి సాహితీవేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సాహితీవేత్త, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.