క్లైమెట్ సమ్మిట్.. కీలక ప్రకటన చేయనున్న బైడెన్!
ABN , First Publish Date - 2021-04-22T23:55:16+05:30 IST
అమెరికా వెదజల్లుతున్న గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 2030 నాటికల్లా 50 శాతం మేర కోతపడేలా పర్యావరణ హిత చర్యలు తీసుకునేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమైనట్టు కీలక అధికారి ఒకరు వెల్లడించారు.
వాషింగ్టన్: అమెరికా వెదజల్లుతున్న గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 2030 నాటికల్లా 50 శాతం మేర కోతపడేలా పర్యావరణ హిత చర్యలు తీసుకునేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమైనట్టు కీలక అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్చువల్ క్లైమెట్ సమ్మిట్లో అగ్రరాజ్యాధ్యక్షుడు బైడెన్ ఈ మేరకు కీలక ప్రకటన చేయనున్నారు. అయితే..ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అమెరికా రవాణా, ఇంధన రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా ముందు పలు మార్గాలు ఉన్నాయి. అమెరికా పవర్ సెక్టర్ను 2035 కల్లా కర్బన కాలుష్య రహితంగా మారుస్తామని బైడెన్ ఇప్పటికే ప్రతిన బూనారు’’ అని సదరు అధికారి వ్యాఖ్యానించారు. కాగా...పర్యావరణ మార్పులపై అమెరికా నేతృత్వంలో జరుగుతున్న ఈ క్లైమెట్ సమ్మిట్ సమావేశంలో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. నానాటికి పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రపంచ దేశాలు మునుపటి లక్ష్యాలకు పునరుద్ధరించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో పాటూ పోప్ ఫ్రాన్సిస్ కూడా పాల్గొంటున్నారు.