29న Hyderabadకు రాష్ట్రపతి కోవింద్..
ABN , First Publish Date - 2021-12-22T13:16:28+05:30 IST
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 29న సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయానికి రానున్నారు...
హైదరాబాద్ సిటీ/అల్వాల్ : శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 29న సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. జనవరి 3 వరకు ఆయన ఇక్కడ బస చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించారు. రాజీవ్రాహదారికి ఇరువైపులా చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఆయా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.
అన్ని సౌకర్యాలూ కల్పించండి..
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విడిది సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. ప్రొటోకాల్ ప్రకారం కల్పించాల్సిన సదుపాయాలపై సీఎస్ మంగళవారం బీఆర్కే భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో రహదారులు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికా్సరాజ్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, ఫైర్ సర్వీసెస్ డీజీ సంజయ్కుమార్ జైన్, అడిషనల్ డీజీ జితేందర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.