సుపరిపాలనకు పారదర్శకత చాలా ముఖ్యం : రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-02-11T23:58:04+05:30 IST

స్వాతంత్ర్యానికి పూర్వం దర్బార్ అంటే రాచరికానికి సంబంధించిన పదమని

సుపరిపాలనకు పారదర్శకత చాలా ముఖ్యం : రాష్ట్రపతి

ముంబై : స్వాతంత్ర్యానికి పూర్వం దర్బార్ అంటే రాచరికానికి సంబంధించిన పదమని, స్వాతంత్ర్యానంతరం దీని ఆధునిక భావన పారదర్శకతను ప్రోత్సహిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో సుపరిపాలనకు చాలా ముఖ్యమైన అంశం పారదర్శకత అని చెప్పారు. రాజ్ భవన్‌లో కొత్తగా పునర్నిర్మించిన దర్బార్ హాలును ఆయన శుక్రవారం ప్రారంభించారు. 


దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ మాదిరిగానే ముంబైలోని రాజ్ భవన్ రాజ్యాంగ చిహ్నంగా నిలిచిందని చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశ ప్రజల ఆకాంక్షలు, ఆశలకు రాజ్యాంగ చిహ్నంగా రాజ్ భవన్ నిలిచినట్లు తెలిపారు. 


మన దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు దర్బార్ అనేది రాచరికానికి సంబంధించినదని చెప్పారు. ప్రస్తుతం ఇది ప్రజాస్వామ్యంతో ముడిపడిందన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో సుపరిపాలనకు చాలా ముఖ్యమైనదైన పారదర్శకతను దర్బార్ ఆధునిక భావన ప్రోత్సహిస్తోందన్నారు. దర్బార్‌లో ప్రైవేటు, రహస్యం ఉండవన్నారు. ఇక్కడ అందరినీ కలుపుకొనిపోతూ అన్నీ బహిరంగంగానే జరుగుతాయన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా జనతా దర్బార్‌లను నిర్వహిస్తున్నారని తెలిపారు. కొత్త దర్బారు హాలు నవ భారతం, నవ మహారాష్ట్ర, శక్తిమంతమైన ప్రజాస్వామ్యాల చిహ్నమని చెప్పారు. 


మహారాష్ట్ర ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందినదని చెప్పారు. అదే విధంగా అన్యాయంపై సాహసోపేతంగా పోరాటాలు జరిగాయన్నారు. దేశ భక్తులు, దైవ భక్తులకు జన్మనిచ్చిన గడ్డ ఇది అని తెలిపారు. దేశంలో మహారాష్ట్ర ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రమని వివరించారు. తన నాలుగున్నరేళ్ళ పదవీ కాలంలో తాను మహారాష్ట్రకు 12సార్లు వచ్చానన్నారు. అయితే ‘భారత రత్న’ లతా మంగేష్కర్ మరణంతో ఇప్పుడు పెద్ద లోటు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వారం క్రితం మనం మనకు ఇష్టమైన లత దీదీని కోల్పోయామన్నారు. ఆమె సంగీతం శాశ్వతమైనదని, రానున్న అనేక తరాలపాటు సజీవంగా ఉంటుందని తెలిపారు. 


సజీవ సాక్ష్యం : ఉద్ధవ్ థాకరే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, గత శతాబ్దంలో జరిగిన అనేక పరిణామాలకు దర్బార్ హాలు సాక్ష్యంగా నిలిచిందన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజా సమస్యలను ప్రస్తావించడం కోసం ఇక్కడికి సంవత్సరానికి ఒకట్రెండుసార్లు వచ్చేవాడినని తెలిపారు. నేటికీ చర్చ కొనసాగుతోందని చెప్పారు. 


Updated Date - 2022-02-11T23:58:04+05:30 IST