ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారానికి.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా
ABN , First Publish Date - 2022-08-08T05:49:28+05:30 IST
అమ్మగా వచ్చి పిల్లల సమస్య తెలు సుకున్నానని, బాసర ట్రిపుల్ఐటీ ఆర్జీయూకేటీలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గవర్నర్ తమిళిసై తెలిపారు.
కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు తెలిపారు
అధ్యాపకులు, ల్యా్ప్టాప్ల కొరత ఉంది
గవర్నర్ తమిళిసై
బాసర ట్రిపుల్ ఐటీ సందర్శన
విద్యార్థుల వసతి సౌకర్యాల పరిశీలన
విద్యార్థులతో కలిసి అల్పాహారం
బాసర సరస్వతీ ఆలయంలో గవర్నర్ పూజలు
ముథోల్/బాసర, ఆగస్టు 7 : అమ్మగా వచ్చి పిల్లల సమస్య తెలు సుకున్నానని, బాసర ట్రిపుల్ఐటీ ఆర్జీయూకేటీలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు రైల్లో వచ్చి తెల్లవారు జామున బాసర ట్రిపుల్ ఐటీకి రోడ్డు మార్గన వచ్చారు. ట్రిపుల్ ఐటీ గెస్ట్ హౌస్లో కొంతసేపు ఆగారు. అనంతరం బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ట్రిపుల్ ఐటీలోని క్యాంపస్లోని మెస్, హాస్టల్తో పాటు పలు వసతులను పరిశీలించారు. అనంతరం గవర్నర్ ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థులతో ప్రత్యేక సమావేశ మయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు ట్రిపుల్ ఐటీలో గర్నవర్ పర్యటన కొనసాగింది. మెస్, బాలిక, బాలుర హాస్టల్, తదితర వసతులను పరిశీలించారు. కాన్ఫరెన్స్ హాల్ ఎదుట మొక్కలు నాటారు. అనంతరం తిరుగు ప్రయాణంలో క్యాంపస్ గేటు బయట మీడియాతో గర్నవర్ మాట్లాడారు. ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ సిబ్బంది విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించినట్లు గవర్నర్ తెలిపారు. ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల కొరత, 2017 నాటి ల్యాప్టాప్లే ఉన్నాయని, ల్యాప్టాప్ల కొరత, క్రీడా పరికరాలు, మెస్లో భోజన సమస్యతో పాటు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు తెలిపారని గర్నవర్ వెల్లడించారు. సమస్యలున్న మాట వాస్తవమేనన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సందర్శించి సమస్యలు అడిగి తెలుసు కున్నట్లు చెప్పారు. క్యాంపస్లో పోలీసుల జోక్యం వద్దని విద్యార్థులు తెలియజేశారన్నారు. ఇటీవల మృతి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. బాధిత కుటుంబానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని గవర్నర్ అన్నారు. విద్యార్థుల సమస్యలను, నెలకొన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారని విలేకరులు ప్రశ్నించగా గవర్నర్ స్పందిస్తూ తాను మంచి డాక్టర్నని, తనకు డయాలసిస్ చేయడం కూడా తెలుసన్నారు. మెస్ విషయంలో విద్యా ర్థులు సంతోషంగా లేరన్నారు. ఇవాళ తాను వచ్చానని ట్రిపుల్ ఐటీలో మంచి అల్పాహారం పెట్టారని అన్నారు. మీరు రోజు వస్తే మంచి భోజనం దొరుకుతుందని విద్యార్థులు అన్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ రోజు నుంచి ట్రిపుల్ ఐటీలో ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతుందని గర్నవర్ అన్నారు. రాష్ట్రం లో గవర్నర్ ఇస్తున్న ప్రోటోకాల్ అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో అమ్మాయిల భద్రత విషయం లో సమస్య ఉన్నట్లు తెలిసిందన్నారు. విద్యార్థులకు తనవం తు సహాయ సహ కారాలు అందిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గర్నవర్ పేర్కొన్నారు. విద్యార్థులకు రెగ్యూలర్ మెడికల్ చెకప్ చేయాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం నిజామాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇదిలా ఉండగా గవర్నర్ ట్రిపుల్ ఐటీ పర్యటనలో యూనివర్సిటీ అధికారులు ఆంక్షలు విధించారు. యూని వర్సిటీలోకి విలేకరులను అనుమతించలేదు. దీంతో గేటు బయటనే నిరీక్షించాల్సి వచ్చింది. తిరుగు ప్ర యాణంలో గేటు బయట రోడ్డుపైనే గవర్నర్ మీడియా స మావేశం నిర్వహించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారిం ది. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న గవర్నర్ ప్రెస్మీట్ రహదారిపై నిర్వహించేలా యూనివర్సిటీ అధి కారులు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా గవర్నర్ పర్యటనకు జిల్లా ఉన్నతాధి కారులు, ప్రజా ప్రతినిధులు దూరంగా ఉన్నారు. ట్రిపుల్ ఐటీకి చేరుకున్న గ వర్నర్ అదనపు కలెక్టర్ రాంబాబు, ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ వెంకటరమణ స్వాగతం పలికారు. కలెక్టర్, మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎస్పీ ఎవరూ కనిపించకపోవడం చర్చనీ యాంశంగా మారింది. గవర్నర్ ఆలయ దర్శినానికి వచ్చిన సందర్భం గా కవరేజ్కు వచ్చిన విలేకరులను పోలీపులు అడ్డుకున్నారు. దీనిని గమనించిన గవర్నర్ వెంటనే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండని వ్వండి ఎందుకు మీడియాను అడ్డుకుంటున్నారని అన్నారు. అయినప్పటికి పోలీసులు మీడియాకు ఆలయంలోకి వెళ్లని వ్వకుండా అడ్డుపడ్డారు. అడుగడుగునా పోలీసులు మీడియా ను అడ్డుకున్నారు. బాసరకు వచ్చిన గవర్నర్కు పలు సమస్యల గురించి కాంగ్రెస్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. బాసర ట్రిపుల్ ఐటీ, బాసర దేవస్థానంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.