America బాటలోనే భారత్.. పెట్రో భారం తగ్గించడమే లక్ష్యంగా ఇరు దేశాలు కీలక ప్రకటన
ABN , First Publish Date - 2021-11-25T13:00:38+05:30 IST
అమెరికాలో పెట్రో ఉత్పత్తులు, ఇతర ధరలను తగ్గించేందుకు జో బైడెన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
వ్యూహాత్మక నిల్వల నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ విడుదల
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశం
1.5 మిలియన్ బ్యారెళ్లు విడుదల చేయనున్న భారత్
వాషింగ్టన్, నవంబరు 24: అమెరికాలో పెట్రో ఉత్పత్తులు, ఇతర ధరలను తగ్గించేందుకు జో బైడెన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేశా రు. ఇంధనాన్ని ఎక్కువగా వినియోగించే భారత్, యూకే, చైనాలతో కలిసి అమెరికా ఈ మేరకు చర్యలు చేపట్టింది. థ్యాంక్స్గివింగ్, శీతాకాల సెలవుల్లో విహార యాత్రల నేపథ్యంలో అమెరికన్లపై ధరల భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఒక గ్యాలన్ గ్యాసోలిన్ 3.40 డాలర్లుగా ఉంది.
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికమని అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ తెలిపింది. ‘మేం కలిసికట్టుగా తీసుకున్న ఈ చర్యలతో రాత్రికి రాత్రే ఈ సమస్య పరిష్కారం కాదు. కానీ, కొంత వ్యత్యాసం మాత్రం ఉంటుంది’ అని బైడెన్ పేర్కొన్నారు. అమెరికా ప్రకటించిన వెంటనే భారత్ కూడా తన వ్యూహ్మాతక చమురు నిల్వల నుంచి 1.5 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. జపాన్, దక్షిణ కొరియా కూడా ఇదే బాటలో నడిచాయి.