అన్నదాతకు ఆసరా!
ABN , First Publish Date - 2020-08-08T08:57:02+05:30 IST
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది.
రుణాలకు కిసాన్ క్రెడిట్ కార్డులు
బ్యాంకుల ద్వారా పంపిణీకి చర్యలు
జిల్లాలో 5,50,525 మందికి లబ్ధి
(ఇచ్ఛాపురం రూరల్): కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి రూ. 6 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తాజాగా అన్నదాతలకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక ఆసరా కల్పించాలని నిర్ణయించింది. ఈ కార్డుల పంపిణీకి మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది రూ. 2,960 కోట్లు రుణ లక్ష్యం కాగా, 5,50,525 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. పంట రుణాలు పొందే రైతులంతా కిసాన్ క్రెడిట్ కార్డులు పొందవచ్చు.
జిల్లావ్యాప్తంగా లక్షలాది మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వారంతా పెట్టుబడి కోసం వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందుతుంటారు. వారందరికీ ఆ బ్యాంకుల ద్వారా ఐదేళ్ల కాలపరిమితితో కిసాన్క్రెడిట్ కార్డులు పంపిణీ చేస్తారు. ఈ కార్డు ద్వారా.. ఎకరా వరికి రూ. 30 వేలు, చెరకుకు రూ. 50 వేలు.. ఇలా పంటను బట్టి రుణం మంజూరు చేస్తారు. రైతులు తమ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం జమయ్యే బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్పుస్తకం తదితర నకళ్లు అందించాలి. రైతు గుర్తింపు కోసం ఎన్ఆర్ఈజీఎస్ జాబ్కార్డు, ఓటరు గుర్తింపు కార్డు కూడా అందజేయవచ్చు. పత్రాలతో రైతు పాస్ఫొటో ఇవ్వాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత బ్యాంకు అధికారులు కార్డు మంజూరు చేస్తారు. ఈ కార్డుల ద్వారా పొందే రుణాలకు సంబంధించి 7 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు. రుణం పొందిన రైతు సకాలంలో రుణాలు చెల్లిస్తే 3 శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తుంది.
కార్డుతో ఉపయోగాలు :
పంట అవసరాలను బట్టి విడతల వారీగా రుణాలు తీసుకోవచ్చు.
ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం ఉంది.
కార్డు తీసుకునే ప్రతి రైతుకూ బీమా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
నెలకు రూ. 12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్ల మద్య వయసున్న రైతులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, 18 నుంచి 50 ఏళ్ల మధ్యగల రైతులకు రూ. 330 ప్రీమియంతో ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన బీమా చేయించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రీమియం సొమ్ము ఏటా రైతు ఖాతాల నుంచి జమచేసుకుంటారు.
వినియోగించుకోవాలి :జి.హరిప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్.
జిల్లాలోని అర్హులైన రైతులు అందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సాయం పొందుతున్న రైతులు చాలా మంది రుణాలు పొందడంలేదు. అందుకే ప్రభుత్వం వారందరికీ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం రుణం తీసుకున్నవారికే కార్డులు అందజేస్తారు. బ్యాంకర్లను సంప్రదించి కార్డులు తీసుకోవాలి.