ఇది అసాధారణ విజయం
ABN , First Publish Date - 2022-05-23T10:13:36+05:30 IST
చరిత్రలో తొలిసారి థామస్ కప్ సాధించిన భారత బ్యాడ్మింటన్ బృందం ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం భేటీ అయ్యింది.
మీ ప్రదర్శన దేశానికి గర్వకారణం
థామస్ కప్ విజేతలతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: చరిత్రలో తొలిసారి థామస్ కప్ సాధించిన భారత బ్యాడ్మింటన్ బృందం ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మోదీ ప్రతీ ఆటగాడికి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడం విశేషం. అలాగే ఈ మెగా ఈవెంట్లో తమకెదురైన అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. మరోవైపు ఇది మామూలు విజయం కాదని, ఇదే జోరు మున్ముందు కూడా ప్రదర్శించాలని ప్రధాని కోరారు. ‘మేమేదైనా సాధిస్తాం.. అనే వైఖరి ఇప్పుడు దేశానికి కొత్త శక్తినిస్తోంది.
మన ఆటగాళ్లందరికీ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందుతుందని హామీ ఇస్తున్నాను. థామస్ కప్లో మీరు సాధించినది అసాధారణ విజయం. దశాబ్ధాల తర్వాత భారత పతాకాన్ని అక్కడ ఎగిరేలా చేశారు. గతంలో ఈ టోర్నీని ఎవరూ ఖాతరు చేయకపోయినా ఈ విజయంతో దేశ ప్రజల దృష్టిని మరల్చారు’ అని ప్రధాని మోదీ కొనియాడారు.