‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ని అనుసంధానించే రైళ్లను ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2021-01-17T18:08:10+05:30 IST

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గుజరాత్‌ రాష్ట్రం కేవాడియాలోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ని అనుసంధానించే ఎనిమిది రైళ్లను ప్రధాని మోదీ

‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ని అనుసంధానించే రైళ్లను ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గుజరాత్‌ రాష్ట్రం కేవాడియాలోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ని అనుసంధానించే ఎనిమిది రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఎనిమిది రైళ్లకు ప్రధాని పచ్చజెండా ఊపారు. ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి వెళ్లడానికి ఒకేసారి ఎనిమిది రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. వారణాసి, దాదర్, అహ్మదాబాద్, హజ్రత్ నిజాముద్దీన్, రీవా, చెన్నైతో పాటు ప్రతాప్ నగర్ ప్రాంతాలను కలుపుతూ ఈ రైళ్లు కెవాడియాకు చేరుకుంటాయి. ఇలా చేయడంతో స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రైల్వే మ్యాప్‌లో ఓ స్థానం లభించినట్టైందని అన్నారు.  రైళ్లను అనుసంధానించడం ద్వారా దేశంలోని ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆ విగ్రహం దగ్గరికి చేరుకునే సౌలభ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రైళ్లలో ‘విస్టా డోమ్ స్ట్రక్చర్’ సౌలభ్యం కూడా ఉందని, దీని ద్వారా చుట్టూ ఉండే పరిసరాలను ఆస్వాదిస్తూ ప్రయాణించగలరని తెలిపారు.


ఈ సౌలభ్యంతో పర్యాటకులకు లాభం చేకూరుతుందని, వీరితో పాటు స్థానికంగా ఉండే వారికి ఉపాధి కల్పనా అవకాశాలు కూడా దొరుకుతాయని మోదీ పేర్కొన్నారు. దీని ద్వారా స్థానికంగా ఉండే గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగయ్యే సూచనలున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. సరిగ్గా ఎంజీ రామచంద్రన్ జయంతి రోజునే చెన్నై నుంచి రైళ్ల అనుసంధానం చేయడం హర్షనీయమని, అది యాదృచ్ఛికమని అన్నారు. పేద ప్రజల క్షేమం కోసం తన జీవితాన్ని ధారబోసిన మహానేత అని ప్రధాని మోదీ కొనియాడారు. 

Updated Date - 2021-01-17T18:08:10+05:30 IST