ఆదేశాలు సరే.. పట్టించుకునే వారేరీ?
ABN , First Publish Date - 2020-07-06T11:03:08+05:30 IST
కరోనా వ్యాప్తితో ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్లైన్ ..
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై విమర్శలు
చిత్తూరు సెంట్రల్, జూలై 5: కరోనా వ్యాప్తితో ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి. అయితే ఆన్లైన్ తరగతుల నిర్వహణ, ఫీజుల వసూలు తగదన్న విషయమై దృష్టిసారించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఆయా విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల ఏబీవీపీ నాయకులు డీఈవోను కలసి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఎక్కడా అధికారులు చర్యలకు దిగిన దాఖలాలు కన్పించడం లేదు. జిల్లాలో 1317 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 2.24 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణలో తలెత్తిన సమస్యల కారణంగా వీరిలో 50శాతం మంది విద్యార్థులు నష్టపోతున్నారు. మరోవైపు అంతంతమాత్రంగా విద్యార్థులతో నడుస్తున్న పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు దూరంగా ఉంటున్నాయి.
దీంతో ఇక్కడి విద్యార్థులు ఇతర పాఠశాలల్లో చేరేందుకు మొగ్గు చూపడంతో చిన్న, మధ్యస్థాయి విద్యాసంస్థలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇదే ఆసరాగా కనీస ఫీజులు చెల్లించనిదే ఆన్లైన్ తరగతులకు సంబంధించి లింక్ ఇవ్వడం కుదరదని పలు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తేల్చిచెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయమై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించక పోవడంపై పిల్లల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.