ప్రైవేట్‌ చదువు గందరగోళం

ABN , First Publish Date - 2022-08-08T05:42:32+05:30 IST

ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది ప్రైవేట్‌ చదువుల పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నేటికీ పాఠ్య పుస్తకాల విషయంలో ఇంకాసరైన స్పష్టత లేక వర్క్‌ బుక్స్‌తోనే విద్యార్థులు చదువులు ముందుకు సాగిస్తున్నారు.

ప్రైవేట్‌ చదువు గందరగోళం
పాఠ్యపుస్తకాలు

మూడు నెలలు గడుస్తున్నా నో బుక్స్‌
పాఠ్య పుస్తకాలపై స్పష్టత నిల్‌.. వర్క్‌బుక్స్‌తోనే ముందుకు
ఆందోళనలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం
నాణ్యత లేని జగనన్న కిట్‌లు పంపిణీ


తాడేపలిగూడెం రూరల్‌, ఆగస్టు 7 : ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది ప్రైవేట్‌ చదువుల పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నేటికీ పాఠ్య పుస్తకాల విషయంలో ఇంకాసరైన స్పష్టత లేక వర్క్‌ బుక్స్‌తోనే విద్యార్థులు చదువులు ముందుకు సాగిస్తున్నారు. దీనికి కారణం ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే తీసుకోవాలని నిబంధనతో ప్రైవేట్‌ చదువు గందరగోళంలో పడింది. పుస్తకాలు తీసుకుందామంటే సరైన సమయానికి అందుబాటులో ఉండవు, బయట పుస్తకాలను విద్యార్థులకు అందిద్దామంటే అది కుదరదని కరాఖండిగా ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యం సంకట స్థితిలో పడింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు 25 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా వాటిని కనాకష్టంగా లక్ష్యం పూర్తిచేశారు. ఆ లెక్కన చూసుకుంటే ప్రైవేట్‌ పాఠశాలలకు కనీసం 30 లక్షల పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ లక్ష్యమే ఐదు లక్షల పాఠ్యపుస్తకాలుగా లెక్కలు వేసుకున్నారు. ఈ క్రమంలో అసలు పుస్తకాలు అందుబాటులోకి వస్తాయా ! అని విద్యాశాఖాధికారులే ఆలోచనలో పడ్డారు.


 లక్ష్యాలు తక్కువ  అవసరం ఎక్కువ..
జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల పుస్తకాలు అవసరం అవుతుండగా వాటికి ఎంత తక్కువ లెక్కేసుకున్నా 30 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం పడతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ లక్ష్యం పూర్తి చేస్తారా లేక మధ్యలోనే ప్రభుత్వం చేతులెత్తేస్తుందా అనే సందేహం ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్నాయి.


 తూతూమంత్రంగా జగనన్న కిట్‌లు
జగనన్న కిట్‌లు తూతూమంతంగా పంపిణీ చేపట్టారు. జగనన్న కిట్‌లో అందించాల్సిన బ్యాగ్‌, బెల్టు అందించిన అధికా రులు తరువాత కాస్త ఆలస్యంగా పుస్తకాల పంపిణీ చేపట్టారు. అందించిన కిట్‌లోని బ్యాగ్‌ నాణ్యత లేమితో పేదల జేబులు గుళ్ల చేసే విధంగా దాని ధరకు రెట్టింపు పెట్టుబడి పెట్టుకునేలా ప్రస్తుతం మరమ్మతులు చేసుకుంటున్నారు. అంటే బ్యాగ్‌ జిప్‌, కుట్టు తదితర సమస్యలు ఎదురవుతుండడంతో బ్యాగ్‌ల మరమ్మతులు చేపట్టే షాపుల వద్ద జగనన్న బ్యాగ్‌లు తారస పడుతున్నాయి. కనీసం రూ.200 తక్కువ కాకుండా ఖర్చు అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వీటితో పాటు విద్యార్థులకు అవసరమైన షూ నేటికి మండల కేంద్రాలకు అందలేదు. బ్యాగ్‌లు, బెల్టులపై ప్రచార ఆర్భాటంతో లేబుల్స్‌ వేసుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి పిల్లలకు నాణ్యమైన కిట్‌లు అందించడంలో లేదని పలువురు విమర్శిస్తున్నారు.

Updated Date - 2022-08-08T05:42:32+05:30 IST