ప్రివిలేజ్‌ కమిటీకి సమాధానమిచ్చిన నిమ్మగడ్డ

ABN , First Publish Date - 2021-03-19T23:29:56+05:30 IST

అసెంబ్లీ కార్యదర్శికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రివిలేజ్‌ కమిటీ నోటీసుకు నిమ్మగడ్డ సమాధానం ఇచ్చారు.

ప్రివిలేజ్‌ కమిటీకి సమాధానమిచ్చిన నిమ్మగడ్డ

అమరావతి: అసెంబ్లీ కార్యదర్శికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రివిలేజ్‌ కమిటీ నోటీసుకు నిమ్మగడ్డ సమాధానం ఇచ్చారు. తాను కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తీసుకున్నానని, హైదరాబాద్‌లో ఉన్నా.. విచారణకు హాజరుకాలేనని తెలిపారు. అసెంబ్లీ, సభ్యులపై తనకు గౌరవం ఉందన్నారు. నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్‌ కమిటీకి లేదని లేఖలో నిమ్మగడ్డ ప్రస్తావించారు. తన హక్కులకు భంగం కలిగించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసుపై సభాహక్కుల కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు శాసనసభ లేఖ రాసింది. తదుపరి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని కూడా కోరింది. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ ఎస్‌ఈసీ తనపై ఉపయోగించిన పదజాలం కించపరచేలా ఉందని మంత్రి పెద్దిరెడ్డి...శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఫిర్యాదు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించాల్సిందిగా సభా హక్కుల సంఘానికి స్పీకర్‌ తమ్మినేని పంపారు. అయితే, సంఘం నిర్ణయం జాప్యమవుతోందని భావించిన మంత్రి పెద్దిరెడ్డి... మరోదఫా సభాపతికి లేఖరాశారు. దీనిని కూడా సభా హక్కుల కమిటీకి స్పీకర్‌ పంపారు.

Updated Date - 2021-03-19T23:29:56+05:30 IST