రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి
ABN , First Publish Date - 2022-06-27T06:21:58+05:30 IST
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి
ఓయూ ప్రొఫెసర్ కాశీం
మహబూబాబాద్ టౌన్, జూన్ 26 : మనువాదుల చెరలో భారత రా జ్యాంగం బందీగా మారిందని, వారి చెరనుంచి పరిరక్షించుకోవాలని ఉస్మానియూ యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీం అన్నారు. వ్యవస్థ మార్పుతోనే సామాజిక న్యాయం సాధ్యమని చెప్పారు. మహబూబాబాద్ వర్తక సంఘం భవన్లో కుల వివక్షవ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) జిల్లా మూడో మహాసభను ఆదివారం నిర్వహించారు. ‘భారత రాజ్యాం గం-సామాజిక న్యాయం’ అనే అంశంపై సెమినార్ను ఏర్పాటు చేయగా ముఖ్యవక్తగా ప్రొఫెసర్ ఖాసీం హాజరై మాట్లాడారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులనలకరించిన దేశ పాలకులు దానిని రద్దు చేయడానికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దివాళకోరు విధానాల వల్ల దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల అసమానతలు పెరిగిపోయాయని చెప్పారు. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తుది శ్వాస విడిచేంతవరకు అసమానతల నిర్మూలన కోసం పని చేశారని వివరించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్బాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమానికి నిధులు కేటాయించడంలో వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా పక్కదారి మళ్లిస్తున్నారని విమర్శించారు. చింత ఎల్లయ్య, నందిపాటి మనోహర్, సాదుల శ్రీనివాస్, కుర్ర మహేష్, ఎనమల కిరణ్కుమార్, జిన్న లచ్చయ్య, దర్గయ్య, యాకూబ్, మహేందర్, వెంకట్రాములు, అనిల్, నాగరాజు పాల్గొన్నారు.