నిరాడంబరంగా దమ్మక్క సేవాయాత్ర

ABN , First Publish Date - 2020-07-06T10:34:43+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం దమ్మక్క సేవాయాత్ర నిరాడంబరంగా నిర్వహించారు.

నిరాడంబరంగా దమ్మక్క సేవాయాత్ర

కరోనా నేపధ్యంలో భక్తులు లేకుండానే కార్యక్రమం


భద్రాచలం, జూలై 5: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం దమ్మక్క సేవాయాత్ర నిరాడంబరంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర లక్ష్మణస్వాములకు ప్రత్యేక పూజలు చేసి అచంచలమైన భక్తి విశ్వాసాలతో రాముని అనుగ్రహారానికి పాత్రురాలైన పోకల దమ్మక్కపేరిట దేవస్థానం ప్రతి ఏటా దమ్మక్క సేవాయాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా  ఉండటంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అఽధికారులు ముందుగానే వెల్లడించారు.


ఈ క్రమంలో ఆలయంలో పొగడ చెట్టు వద్ద దమ్మక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మేళతాళాలతో రామయ్య కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అంతకు ముందు మేళతాళాలతో రామాలయం నుంచి చప్టా దిగువ, కల్యాణ మండపం రోడ్డు, ఎఎస్‌పి ఆఫీసు రోడ్డు మీదుగా పోకల దమ్మక్క సెంటర్‌కు చేరుకొని అక్కడ ఉన్న దమ్మక్క విగ్రహానికి పూజలు నిర్వహించి సారెను సమర్పించారు.


కార్యక్రమంలో స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్‌, ఉప ప్రధాన అర్చకులు అమరవాది శ్రీనివాస రామానుజం, ముఖ్య అర్చకులు శ్రీపెరంబుదుర్‌ మదన్‌మోహనాచార్యులు, అర్చకులు  సౌమిత్రి శ్రీనివాసాచార్యులు, కోటి విష్ణువర్దనాచార్యులు, వేద పండితులు చిట్టి హనుమత్‌శాస్త్రి, ఆలయ పర్యవేక్షకులు కత్తి శ్రీనివాసు లింగాల సాయిబాబా పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T10:34:43+05:30 IST