ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2021-07-24T07:08:02+05:30 IST
శుక్రవారం
కామారెడ్డిటౌన్, జూలై 23: జిల్లాలో భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధి కారులతో దెబ్బతిన్న పంటలు, ఇళ్ల వివరాలను అడి గి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు తడిసిన ఇళ్లను గుర్తించాలని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 35 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 174 ఎకరాలలో వరి, సోయాబీన్, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని ఆర్డీవో శ్రీను తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 55 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలిపారు. 33 ఎకరాల్లో సోయాబీన్, పత్తిపంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లాలో 14 విద్యుత్ స్తంభాలు పడిపోయినట్లు గుర్తించామని ట్రాన్స్కో ఎస్ఈ శేషారావు తెలిపారు. 7 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించామని తెలిపారు. జిల్లాలోని చెరువుల పరిస్థితిపై కలెక్టర్ అధికారులను ఆరాతీశారు. దెబ్బతిన్న కల్వర్టులను, అధ్వానంగా మారిన రోడ్లను గుర్తించి మరమ్మతులు తక్షణమే చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.