వైసీపీ పాలనలో ముస్లింలకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2021-11-27T06:30:14+05:30 IST
వైసీపీ పాలనలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని అంజుమన్ కమిటీ మాజీ అధ్యక్షుడు రోషన్ సందాని అన్నారు.
అంజుమన్ కమిటీ మాజీ అధ్యక్షుడు రోషన్ సందాని
కనిగిరి, నవంబరు 26: వైసీపీ పాలనలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని అంజుమన్ కమిటీ మాజీ అధ్యక్షుడు రోషన్ సందాని అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ముస్లింమైనార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన షేక్ సైదా అనే వ్యక్తిని అతి దారుణంగా దాడి చేయడం పట్ల వారు తీవ్రంగా ఖండించారు. వైసీపీ పాలనలో ముస్లీంలకు రక్షణ లేదని ఈ ఘటనే నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజమండ్రి, నంద్యాల, కడప, పిడుగురాళ్ల ప్రాంతాల్లో గతంలో మెనార్టీలపై దాడులు జరిగాయని, మళ్లీ ఇప్పుడు తుమ్మలచెరువులో అతి కిరాతకంగా షేక్ సైదాను దాడి చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ఈ దాడులపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మైనార్టీ శాఖమంత్రి అంజాద్బాష ముస్లిం సంక్షేమానికి రూ.8వేల కోట్లు ఖర్చు చేశామని, బాహటంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఆ డబ్బుతో ఏమి చేశారో చెప్పాలన్నారు. మరి ఖర్చుపెట్టిన రూ. 8వేల కోట్లు ఎమైయ్యాయో, ఎప్పుడు, ఎలా ఖర్చు చేశారో వారే తెలపాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు జంషీర్ అహ్మద్, కనిగిరి మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్బాష, యాసిన్, ఉమర్ ఫారూఖ్, తెలుగు యువత ఎస్కె ఫిరోజ్, మస్తాన్బాబు, విన్ను, రహిమాన్, మహ్మద్ఆలీ, ఖలీల్, షాకీర్, పాశ్చు, ఖాదర్వలి తదితరులు పాల్గొన్నారు.