నిరపరాధులకు రక్షణ పౌరచైతన్యమే !

ABN , First Publish Date - 2021-07-13T06:54:37+05:30 IST

‘బ్రిటిష్‌ ప్రభుత్వం 1940లో నన్ను మొదటిసారి అరెస్టు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1969లో మళ్ళీ అరెస్టు చేసింది. పరపాలనలోనూ స్వపాలనలోనూ ఒకే చట్టం కింద...

నిరపరాధులకు రక్షణ పౌరచైతన్యమే !

‘బ్రిటిష్‌ ప్రభుత్వం 1940లో నన్ను మొదటిసారి అరెస్టు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1969లో మళ్ళీ అరెస్టు చేసింది. పరపాలనలోనూ స్వపాలనలోనూ ఒకే చట్టం కింద- (1860 నాటి ఐపిసి సెక్షన్‌)- నేను నిర్బంధితుడనయ్యాను’ -‘నాగిరెడ్డి కుట్రకేసు’గా ప్రాచుర్యంలో ఉన్న హైదరాబాద్‌ కుట్రకేసు విచారణ ముగింపు సందర్భంలో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 313 సెక్షన్‌ కింద కేసులో ఒకటో ముద్దాయిగా ఉన్న తరిమెల నాగిరెడ్డి ప్రకటనలోని ప్రారంభ వాక్యాలివి. ఈ ప్రకటనే ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకంగా సుప్రసిద్ధమయింది. ‘వలస అధికార వ్యవస్థ శిథిలమై, స్వతంత్ర జాతీయ రాజ్యాలు ఆవిర్భవించినంత మాత్రాన, ఆ మాజీ వలసల్లో సాంఘిక, ఆర్థిక మార్పు సంభవించదని నోబెల్ ఆర్థిక పురస్కార గ్రహీత గున్నార్ మిర్దాల్ తన ‘ఏషియన్ డ్రామా’లో పేర్కొన్న విషయాన్ని కూడా నాగిరెడ్డి తన ప్రకటనలో ఉటంకించారు. 


1837లో లార్డ్‌ మెకాలే ఐపిసి ముసాయిదాను రూపొందించారు. ఆ ముసాయిదాలో 113వ సెక్షన్‌గా రాజద్రోహం (సెడిషన్‌) విషయం ఉంది. ఈ ముసాయిదాను 1860లో ఆమోదించారు. అయితే ఆ ఆమోదిత శిక్షాస్మృతిలో ఈ సెక్షన్‌ లేదు. సాక్ష్యాధారాల చట్టాన్ని రూపొందించిన జేమ్స్ స్టీఫెన్‌ చొరవతో ఈ సెక్షన్‌ను 1870లో స్వాతంత్ర సమరయోధుల్ని నిరోధించటానికి 124(ఎ)గా చేర్చారు. బ్రిటిష్‌ ప్రభుత్వం తమ వ్యతిరేకులను అణిచివేయటానికి దీనిని చేర్చినా 1891 దాకా ఉపయోగించలేదు. 1891 ‘ఏజ్‌ ఆఫ్‌ కన్సెంట్‌ బిల్‌’ను సమర్ధించినందుకు ‘బందోవాసి’ పత్రిక సంపాదకుడు యోగేంద్ర చంద్రబోస్‌పై ఈ సెక్షన్‌ కింద తొలిసారి కేసు దాఖలు చేశారు. లోక్‌మాన్య తిలక్‌, మహాత్మాగాంధీ కూడా దాని బాధితులే. ఇంతకూ ఈ సెక్షన్‌ 124(ఎ)లో ఏముంది? ‘చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా శత్రుభావనను, అసంతృప్తిని ప్రేరేపించటం దేశద్రోహంగా పరిగణించబడుతుంది’ అని ఆ సెక్షన్ స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. అయితే ‘ప్రభుత్వం చేసే చర్యలను సవరింపచేయాలనే సంకల్పంతో, చట్టబద్ధంగా చేసే వ్యాఖ్యలు ఈ సెక్షన్‌ కింద దేశద్రోహంగా పరిగణింపబడవు’ అని ఆ సెక్షన్ స్పష్టంగా చెప్పింది. 


స్వాతంత్ర్యానంతరం కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలోనే ఈ సెక్షన్‌ దుర్వినియోగమయింది. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దుర్వినియోగం విశ్వరూపం దాల్చింది. ఈ సెక్షన్‌ను వినియోగిస్తూనే ఇంకా మీసా, టాడా, ఎస్మా, సాయుధదళాలకు ప్రత్యేక అధికారాల చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ–ఊపా) లాటి చట్టాల్ని తీసుకొచ్చి రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే చర్యలకు పూనుకుంటున్నారు. మోదీ హయాంలో దేశద్రోహం కింద నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువ. వ్యవసాయ చట్టాలపై నిరసనల కాలంలో -6, సిఎఎ వ్యతిరేక ఆందోళనల సందర్భంలో 25, హత్రాస్‌ గ్యాంగ్‌రేప్ తర్వాత- 22, పుల్వామా దాడి తర్వాత 27 కేసులు నమోదయ్యాయి. 2010 నుంచి ఈ సెక్షన్‌ కింద 11,000 మందిపై 816 కేసులు నమోదయ్యాయి. ఇందులో 65% మోదీ పాలనలోనే జరిగాయి. అధికార రాజకీయ నాయకుల్ని విమర్శించినందుకే 405 మంది పౌరులు, విపక్ష రాజకీయ నాయకులు, విద్యార్థులు, పాత్రికేయులు, కార్టూనిస్టులు, రచయితలు, ఇతర మేధావులపై ఈ సెక్షన్‌ను ప్రయోగించారు. భారత శిక్షాస్మృతిలో ఉన్న చట్టాలన్నింటి కన్నా అత్యంత పాశవికమైనదిగా 124(ఎ)ని మహాత్మాగాంధీ ఈసడించారు. స్వాతంత్య్రం వచ్చాక మన చట్టాల్లో ఏ మాత్రం ఉండతగనిదిగా ఈ సెక్షన్‌ను జవహర్‌లాల్‌ నెహ్రూ నిరసించారు. అయినా దీన్ని నేటికీ పదిలంగా ఉంచి మరింతగా దుర్వినియోగం చేస్తుండటం మహావిడ్డూరం.


ఇటీవల బిజెపి ప్రభుత్వం భీమా కొరెగావ్‌ కుట్రకేసును రచయితలు, మేధావులపై బనాయించింది. వారిలో ఆనంద్‌ తేల్తుండే, వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్‌, గౌతం నవలఖా, స్టాన్‌స్వామి, సుధా భరద్వాజ్‌, రితుపణ్‌ గోస్వామి, వెర్నిన్‌, రోనా విల్సన్‌, షోమాసేన్‌, మహేష్‌ రౌత్‌ తదితరులు ఉన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు అతి పెద్ద కేసుగా ఉన్న పార్వతీపురం కుట్ర కేసును అధిగమించి 10,000 పేజీల ఛార్జిషీటును దాఖలు చేశారు. బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా దళితుల్ని సమైక్యపరచి వారు హింసకు పాల్పడేట్టు చేశారని, మావోయిస్టుల కార్యక్రమాన్ని ఎల్గార్‌ పరిషత్‌ అమలు పరుస్తోందని ఆరోపించారు. దానితో ఆగకుండా ప్రధానమంత్రిని హత్య చేయటానికి పథకం పన్నారని మరో ఆరోపణ చేశారు. వరవరరావు మావోయిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడని, నేపాల్‌ మావోయిస్టు నేత వసంత్‌తో ఆయుధాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నారని, ప్రొఫెసర్‌ హనీబాబు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన విద్యార్థులకు మావోయిస్టు సిద్ధాంతాల్ని భోధిస్తున్నాడని ఇలాటి నిరాధార ఆరోపణలు చేశారు. కాల్పనిక సాహిత్య రచనలో నిష్ణాతులైన రచయితల కన్నా మిన్నగా కథలల్లటంలో పోలీసులు ఎక్కువ ప్రవీణులని మరోసారి రుజువైంది. గౌతమ్ నవలఖాకి కళ్ళజోడు ఇవ్వటానికి నిరాకరించి, బోంబే హైకోర్టు ఆదేశాలపై గాని ఇవ్వలేదు. తీవ్ర అనారోగ్య కారణాలపై వరవరరావుకు కండిషన్‌ బెయిల్‌ ఇచ్చారు. పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న స్టాన్‌స్వామికి సిప్పర్‌ ఇవ్వటానికి కూడా నిరాకరించి, పెద్దఎత్తున విమర్శలు రావటంతో అంగీకరించారు. గత ఏడాది అక్టోబర్ 8న అరెస్టయిన స్టాన్‌స్వామి బెయిల్ రాకుండానే విచారణలో ఉన్న ఖైదీగానే ఈ నెల 5న మరణించారు. ఆయన మృతిపై విచారణ జరిపించాలని ప్రధాన రాజకీయ పార్టీలు సంయుక్తంగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. సుధా భరద్వాజ్‌ గత రెండు సంవత్సరాల్లో 60 సార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 


124(ఎ)ను దుర్వినియోగం చేయడంలో మోదీ ప్రభుత్వాన్ని మించిన మరో సర్కారు ఎపి ప్రభుత్వమే. సాంకేతికంగా తన స్వంత పార్లమెంటు సభ్యుడైన రఘురామ కృష్ణంరాజుపై ఈ నేరాన్ని మోపడంతో పాటు కస్టడీలో ఉన్న ఆయనపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించే బరితెగింపుకి పాల్పడింది. సుప్రీంకోర్టు చొరవతో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు కాని ఈ కేసులో భవిష్యత్‌ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాయనడంలో సందేహం లేదు. ఇదే ఎపి ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు చెందిన ఒక న్యాయమూర్తి రామకృష్ణపై దేశద్రోహ నేరం ఆపాదించి, అరెస్టు చేసింది. ఆయన్ని అరెస్టు చేసినప్పుడు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ పాటించారా? జిల్లాకోర్టు న్యాయమూర్తిని గాని, హైకోర్టును గాని సంప్రదించారా? అని ప్రశ్నిస్తే ఆయన మేజిస్ట్రేట్‌గా విధుల్లో లేడని ప్రభుత్వ న్యాయవాది చెబుతున్నారు. ‘సస్పెన్షన్‌’కి ‘రిమూవల్‌’కి తేడా తెలియని స్థితిలో ప్రభుత్వ న్యాయవాదులుంటే, వారికి ఫీజుల రూపంలో లక్షల ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతోంది.


జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు నటాషా సల్వార్‌, దేవాంగణా కలిత, జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్థి ఆసిఫ్‌ ఇక్బాల్‌లకు జూన్‌ మొదటి వారంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ‘నిరసన తెలపటం పౌరుల ప్రాథమిక హక్కని, వారిని ఉగ్రవాదులుగా చిత్రించటం సహేతుకం కాదని, నలుగుర్ని కలుపుకుని నిరసన తెలియజేస్తే ఇలాటి చట్టాల్ని ప్రయోగిస్తారా’ అని జస్టిస్‌ సిద్ధార్థ మృదుల్‌, జస్టిస్‌ అనూప్‌ భంభానీలు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇంతటితో సరిపుచ్చుకోకుండా దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళగా హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అత్యంత హాస్యాస్పదమూ, జుగుప్సాకరమైన విషయం ఏమంటే ఉత్తరప్రదేశ్‌లో గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన అత్యాచారం ఘటనపై కవరేజ్‌కి వెళ్ళిన కప్పన్‌ అనే పాత్రికేయుణ్ణి, అతడికి ఘటన వివరాలందిస్తున్న ఇద్దరు ముస్లిం యువకుల్ని ఊపా చట్టం కింద అరెస్టు చేయటమే గాక వారు ఉపయోగిస్తున్న వోలా అద్దె కారు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేసి, అప్పటి నుంచి జైల్లోనే ఉంచారు.


ఉన్నత న్యాయస్థానాల స్పందన ప్రజాస్వామిక విలువల్ని కాపాడే క్రమంలో ఆశాజనకంగా ఉన్నా కిందికోర్టుల వ్యవహారసరళి నిర్వేదాన్ని కలిగిస్తోంది. ప్రాసిక్యూషన్‌ పెట్టే రిమాండ్‌ రిపోర్టులను చదవకుండానే ఆమోదించే న్యాయమూర్తులు దిగువకోర్టుల్లో కోకొల్లలు. ఉన్నత న్యాయస్థానాల వ్యాఖానాల్ని చూస్తే అసలు ఈ కేసుల్లో నిందితులకు జుడీషియల్‌ రిమాండ్‌ ఇవ్వటమే అక్రమం. ఈ విషయాల్లో కింది కోర్టులకు తగు ఆదేశాలు జారీచేయడం ఉన్నత న్యాయస్థానాల బాధ్యత. ప్రాసిక్యూషన్‌ ఆరోపణలకు గుడ్డిగా తలలూపే స్థితి నుంచి దిగువ కోర్టుల న్యాయమూర్తులు బయటపడాలి. మొత్తానికి ఈ క్రూరచట్టాలపై పెద్ద ఎత్తున చర్చ జరగటం ఆహ్వానించదగిన పరిణామం. అక్రమ కేసుల్లో సంవత్సరాల తరబడి జైల్లో ఉండి బెయిల్‌ పొందడాన్నే గొప్ప విజయంగా భావించే స్థితి నుంచి మేధావులు బయటపడాలి. కోర్టుల స్పందన కన్నా పౌర సమాజం స్పందిస్తేనే అక్రమ కేసుల నుండి నిరపరాధుల్ని రక్షించగలం. ఈ చట్టాలు, వాటి దుర్వినియోగంపై స్పష్టమైన అవగాహన ఉన్న న్యాయమూర్తి ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ శుభ తరుణాన్ని ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం.


టిష్‌ ప్రభుత్వం 1940లో నన్ను మొదటిసారి అరెస్టు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1969లో మళ్ళీ అరెస్టు చేసింది. పరపాలనలోనూ స్వపాలనలోనూ ఒకే చట్టం కింద- (1860 నాటి ఐపిసి సెక్షన్‌)- నేను నిర్బంధితుడనయ్యాను’ -‘నాగిరెడ్డి కుట్రకేసు’గా ప్రాచుర్యంలో ఉన్న హైదరాబాద్‌ కుట్రకేసు విచారణ ముగింపు సందర్భంలో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 313 సెక్షన్‌ కింద కేసులో ఒకటో ముద్దాయిగా ఉన్న తరిమెల నాగిరెడ్డి ప్రకటనలోని ప్రారంభ వాక్యాలివి. ఈ ప్రకటనే ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకంగా సుప్రసిద్ధమయింది. ‘వలస అధికార వ్యవస్థ శిథిలమై, స్వతంత్ర జాతీయ రాజ్యాలు ఆవిర్భవించినంత మాత్రాన, ఆ మాజీ వలసల్లో సాంఘిక, ఆర్థిక మార్పు సంభవించదని నోబెల్ ఆర్థిక పురస్కార గ్రహీత గున్నార్ మిర్దాల్ తన ‘ఏషియన్ డ్రామా’లో పేర్కొన్న విషయాన్ని కూడా నాగిరెడ్డి తన ప్రకటనలో ఉటంకించారు. 


1837లో లార్డ్‌ మెకాలే ఐపిసి ముసాయిదాను రూపొందించారు. ఆ ముసాయిదాలో 113వ సెక్షన్‌గా రాజద్రోహం (సెడిషన్‌) విషయం ఉంది. ఈ ముసాయిదాను 1860లో ఆమోదించారు. అయితే ఆ ఆమోదిత శిక్షాస్మృతిలో ఈ సెక్షన్‌ లేదు. సాక్ష్యాధారాల చట్టాన్ని రూపొందించిన జేమ్స్ స్టీఫెన్‌ చొరవతో ఈ సెక్షన్‌ను 1870లో స్వాతంత్ర సమరయోధుల్ని నిరోధించటానికి 124(ఎ)గా చేర్చారు. బ్రిటిష్‌ ప్రభుత్వం తమ వ్యతిరేకులను అణిచివేయటానికి దీనిని చేర్చినా 1891 దాకా ఉపయోగించలేదు. 1891 ‘ఏజ్‌ ఆఫ్‌ కన్సెంట్‌ బిల్‌’ను సమర్ధించినందుకు ‘బందోవాసి’ పత్రిక సంపాదకుడు యోగేంద్ర చంద్రబోస్‌పై ఈ సెక్షన్‌ కింద తొలిసారి కేసు దాఖలు చేశారు. లోక్‌మాన్య తిలక్‌, మహాత్మాగాంధీ కూడా దాని బాధితులే. ఇంతకూ ఈ సెక్షన్‌ 124(ఎ)లో ఏముంది? ‘చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా శత్రుభావనను, అసంతృప్తిని ప్రేరేపించటం దేశద్రోహంగా పరిగణించబడుతుంది’ అని ఆ సెక్షన్ స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. అయితే ‘ప్రభుత్వం చేసే చర్యలను సవరింపచేయాలనే సంకల్పంతో, చట్టబద్ధంగా చేసే వ్యాఖ్యలు ఈ సెక్షన్‌ కింద దేశద్రోహంగా పరిగణింపబడవు’ అని ఆ సెక్షన్ స్పష్టంగా చెప్పింది. 


స్వాతంత్ర్యానంతరం కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలోనే ఈ సెక్షన్‌ దుర్వినియోగమయింది. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దుర్వినియోగం విశ్వరూపం దాల్చింది. ఈ సెక్షన్‌ను వినియోగిస్తూనే ఇంకా మీసా, టాడా, ఎస్మా, సాయుధదళాలకు ప్రత్యేక అధికారాల చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ–ఊపా) లాటి చట్టాల్ని తీసుకొచ్చి రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే చర్యలకు పూనుకుంటున్నారు. మోదీ హయాంలో దేశద్రోహం కింద నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువ. వ్యవసాయ చట్టాలపై నిరసనల కాలంలో -6, సిఎఎ వ్యతిరేక ఆందోళనల సందర్భంలో 25, హత్రాస్‌ గ్యాంగ్‌రేప్ తర్వాత- 22, పుల్వామా దాడి తర్వాత 27 కేసులు నమోదయ్యాయి. 2010 నుంచి ఈ సెక్షన్‌ కింద 11,000 మందిపై 816 కేసులు నమోదయ్యాయి. ఇందులో 65% మోదీ పాలనలోనే జరిగాయి. అధికార రాజకీయ నాయకుల్ని విమర్శించినందుకే 405 మంది పౌరులు, విపక్ష రాజకీయ నాయకులు, విద్యార్థులు, పాత్రికేయులు, కార్టూనిస్టులు, రచయితలు, ఇతర మేధావులపై ఈ సెక్షన్‌ను ప్రయోగించారు. భారత శిక్షాస్మృతిలో ఉన్న చట్టాలన్నింటి కన్నా అత్యంత పాశవికమైనదిగా 124(ఎ)ని మహాత్మాగాంధీ ఈసడించారు. స్వాతంత్య్రం వచ్చాక మన చట్టాల్లో ఏ మాత్రం ఉండతగనిదిగా ఈ సెక్షన్‌ను జవహర్‌లాల్‌ నెహ్రూ నిరసించారు. అయినా దీన్ని నేటికీ పదిలంగా ఉంచి మరింతగా దుర్వినియోగం చేస్తుండటం మహావిడ్డూరం.


ఇటీవల బిజెపి ప్రభుత్వం భీమా కొరెగావ్‌ కుట్రకేసును రచయితలు, మేధావులపై బనాయించింది. వారిలో ఆనంద్‌ తేల్తుండే, వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్‌, గౌతం నవలఖా, స్టాన్‌స్వామి, సుధా భరద్వాజ్‌, రితుపణ్‌ గోస్వామి, వెర్నిన్‌, రోనా విల్సన్‌, షోమాసేన్‌, మహేష్‌ రౌత్‌ తదితరులు ఉన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు అతి పెద్ద కేసుగా ఉన్న పార్వతీపురం కుట్ర కేసును అధిగమించి 10,000 పేజీల ఛార్జిషీటును దాఖలు చేశారు. బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా దళితుల్ని సమైక్యపరచి వారు హింసకు పాల్పడేట్టు చేశారని, మావోయిస్టుల కార్యక్రమాన్ని ఎల్గార్‌ పరిషత్‌ అమలు పరుస్తోందని ఆరోపించారు. దానితో ఆగకుండా ప్రధానమంత్రిని హత్య చేయటానికి పథకం పన్నారని మరో ఆరోపణ చేశారు. వరవరరావు మావోయిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడని, నేపాల్‌ మావోయిస్టు నేత వసంత్‌తో ఆయుధాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నారని, ప్రొఫెసర్‌ హనీబాబు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన విద్యార్థులకు మావోయిస్టు సిద్ధాంతాల్ని భోధిస్తున్నాడని ఇలాటి నిరాధార ఆరోపణలు చేశారు. కాల్పనిక సాహిత్య రచనలో నిష్ణాతులైన రచయితల కన్నా మిన్నగా కథలల్లటంలో పోలీసులు ఎక్కువ ప్రవీణులని మరోసారి రుజువైంది. గౌతమ్ నవలఖాకి కళ్ళజోడు ఇవ్వటానికి నిరాకరించి, బోంబే హైకోర్టు ఆదేశాలపై గాని ఇవ్వలేదు. తీవ్ర అనారోగ్య కారణాలపై వరవరరావుకు కండిషన్‌ బెయిల్‌ ఇచ్చారు. పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న స్టాన్‌స్వామికి సిప్పర్‌ ఇవ్వటానికి కూడా నిరాకరించి, పెద్దఎత్తున విమర్శలు రావటంతో అంగీకరించారు. గత ఏడాది అక్టోబర్ 8న అరెస్టయిన స్టాన్‌స్వామి బెయిల్ రాకుండానే విచారణలో ఉన్న ఖైదీగానే ఈ నెల 5న మరణించారు. ఆయన మృతిపై విచారణ జరిపించాలని ప్రధాన రాజకీయ పార్టీలు సంయుక్తంగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. సుధా భరద్వాజ్‌ గత రెండు సంవత్సరాల్లో 60 సార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 


124(ఎ)ను దుర్వినియోగం చేయడంలో మోదీ ప్రభుత్వాన్ని మించిన మరో సర్కారు ఎపి ప్రభుత్వమే. సాంకేతికంగా తన స్వంత పార్లమెంటు సభ్యుడైన రఘురామ కృష్ణంరాజుపై ఈ నేరాన్ని మోపడంతో పాటు కస్టడీలో ఉన్న ఆయనపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించే బరితెగింపుకి పాల్పడింది. సుప్రీంకోర్టు చొరవతో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు కాని ఈ కేసులో భవిష్యత్‌ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాయనడంలో సందేహం లేదు. ఇదే ఎపి ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు చెందిన ఒక న్యాయమూర్తి రామకృష్ణపై దేశద్రోహ నేరం ఆపాదించి, అరెస్టు చేసింది. ఆయన్ని అరెస్టు చేసినప్పుడు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ పాటించారా? జిల్లాకోర్టు న్యాయమూర్తిని గాని, హైకోర్టును గాని సంప్రదించారా? అని ప్రశ్నిస్తే ఆయన మేజిస్ట్రేట్‌గా విధుల్లో లేడని ప్రభుత్వ న్యాయవాది చెబుతున్నారు. ‘సస్పెన్షన్‌’కి ‘రిమూవల్‌’కి తేడా తెలియని స్థితిలో ప్రభుత్వ న్యాయవాదులుంటే, వారికి ఫీజుల రూపంలో లక్షల ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతోంది.


జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు నటాషా సల్వార్‌, దేవాంగణా కలిత, జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్థి ఆసిఫ్‌ ఇక్బాల్‌లకు జూన్‌ మొదటి వారంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ‘నిరసన తెలపటం పౌరుల ప్రాథమిక హక్కని, వారిని ఉగ్రవాదులుగా చిత్రించటం సహేతుకం కాదని, నలుగుర్ని కలుపుకుని నిరసన తెలియజేస్తే ఇలాటి చట్టాల్ని ప్రయోగిస్తారా’ అని జస్టిస్‌ సిద్ధార్థ మృదుల్‌, జస్టిస్‌ అనూప్‌ భంభానీలు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇంతటితో సరిపుచ్చుకోకుండా దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళగా హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అత్యంత హాస్యాస్పదమూ, జుగుప్సాకరమైన విషయం ఏమంటే ఉత్తరప్రదేశ్‌లో గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన అత్యాచారం ఘటనపై కవరేజ్‌కి వెళ్ళిన కప్పన్‌ అనే పాత్రికేయుణ్ణి, అతడికి ఘటన వివరాలందిస్తున్న ఇద్దరు ముస్లిం యువకుల్ని ఊపా చట్టం కింద అరెస్టు చేయటమే గాక వారు ఉపయోగిస్తున్న వోలా అద్దె కారు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేసి, అప్పటి నుంచి జైల్లోనే ఉంచారు.


ఉన్నత న్యాయస్థానాల స్పందన ప్రజాస్వామిక విలువల్ని కాపాడే క్రమంలో ఆశాజనకంగా ఉన్నా కిందికోర్టుల వ్యవహారసరళి నిర్వేదాన్ని కలిగిస్తోంది. ప్రాసిక్యూషన్‌ పెట్టే రిమాండ్‌ రిపోర్టులను చదవకుండానే ఆమోదించే న్యాయమూర్తులు దిగువకోర్టుల్లో కోకొల్లలు. ఉన్నత న్యాయస్థానాల వ్యాఖానాల్ని చూస్తే అసలు ఈ కేసుల్లో నిందితులకు జుడీషియల్‌ రిమాండ్‌ ఇవ్వటమే అక్రమం. ఈ విషయాల్లో కింది కోర్టులకు తగు ఆదేశాలు జారీచేయడం ఉన్నత న్యాయస్థానాల బాధ్యత. ప్రాసిక్యూషన్‌ ఆరోపణలకు గుడ్డిగా తలలూపే స్థితి నుంచి దిగువ కోర్టుల న్యాయమూర్తులు బయటపడాలి. మొత్తానికి ఈ క్రూరచట్టాలపై పెద్ద ఎత్తున చర్చ జరగటం ఆహ్వానించదగిన పరిణామం. అక్రమ కేసుల్లో సంవత్సరాల తరబడి జైల్లో ఉండి బెయిల్‌ పొందడాన్నే గొప్ప విజయంగా భావించే స్థితి నుంచి మేధావులు బయటపడాలి. కోర్టుల స్పందన కన్నా పౌర సమాజం స్పందిస్తేనే అక్రమ కేసుల నుండి నిరపరాధుల్ని రక్షించగలం. ఈ చట్టాలు, వాటి దుర్వినియోగంపై స్పష్టమైన అవగాహన ఉన్న న్యాయమూర్తి ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ శుభ తరుణాన్ని ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం.

చెరుకూరి సత్యనారాయణ

Updated Date - 2021-07-13T06:54:37+05:30 IST