బోర్డు నిధుల మళ్లింపు అక్రమం

ABN , First Publish Date - 2021-12-03T05:56:35+05:30 IST

కార్మికుల సంక్షేమబోర్డు నిధులను ప్రభుత్వం అక్రమంగా మళ్లించి వాడుకోవడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ తెలిపారు.

బోర్డు నిధుల మళ్లింపు అక్రమం
కార్మికశాఖ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న భవన నిర్మాణ కార్మికులు

భవన నిర్మాణ కార్మికుల నిరసన

గుంటూరు(తూర్పు), డిసెంబరు 2: కార్మికుల సంక్షేమబోర్డు నిధులను ప్రభుత్వం అక్రమంగా మళ్లించి వాడుకోవడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ తెలిపారు. నిధులను వెనక్కు ఇవ్వడంతోపాటు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం అరండల్‌పేటలోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ బోర్డులను నిర్వీర్యం చేసే కుట్రపూరిత విధానాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమం గాలికివదిలేయడమేగాక రెండేళ్ల నుంచి రెన్యువల్‌ రూపంలో నగదు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. దక్షిణ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి అక్రమంగా తరలించిన రూ.450 కోట్లను తిరిగి బోర్డుకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో నికల్సన్‌, బాషా, చింతల శ్రీనివాస్‌, మస్తాన్‌, అక్కారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T05:56:35+05:30 IST