నిధులు మళ్లింపుపై నిరసన
ABN , First Publish Date - 2021-11-26T06:05:25+05:30 IST
పంచాయతీలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంపై సర్పంచ్లు నిరసనకు దిగారు.
అమృతలూరులో సర్పంచ్ల నిరాహార దీక్ష
సమావేశాన్ని బహిష్కరించిన కొలకలూరు సర్పంచ్
అమృతలూరు, తెనాలి రూరల్, నవంబరు 25: పంచాయతీలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంపై సర్పంచ్లు నిరసనకు దిగారు. పంచాయతీల్లో అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులను తీసుకోవడంపై మండిపడ్డారు. అమృతలూరు మండల పరిధిలోని పాంచాళవరం, గోవాడ, బోడపాడు గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు నిరాహార దీక్షకు దిగారు. అంతకముందు సర్పంచ్లు, వార్డు సభ్యులు గ్రామంలో భిక్షాటన చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. స్థానిక శ్రీప్రసన్నాంజనేయస్వామి కళావేదిక వద్ద నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం సమాచారం ఇవ్వకుండా తీసేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు పావులూరి హేమచంద్, మండవ విజయలక్ష్మి, కనగాల శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెనాలి మండలం కొలకలూరులో గురువారం పంచాయతీ కార్యాలయంలో జరగనున్న సాధారణ సమావేశాన్ని సర్పంచ్, వార్డు సభ్యులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధుల దారి మళ్లింపుతో పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అస్కారం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో సమస్యలు పరిష్కరించుకునేందుకు ఉపయోగ పడే నిధులను తిరిగి కేటాయించాలని డిమాండ్ చేశారు.