వ్యవసాయానికి కరెంటు కోతలను నిరసిస్తూ.. భైంసాలో ట్రాన్స్కో కార్యాలయం ముట్టడి
ABN , First Publish Date - 2021-03-04T05:57:09+05:30 IST
వ్యవసాయ రంగానికి కరెంటు కోతలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా భైంసా ట్రాన్స్కో కార్యాలయాన్ని బుధవారం మండలంలోని మహగావ్ గ్రామ రైతులు ముట్టడించారు.
పంటలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన
భైంసా క్రైం, మార్చి 3 : వ్యవసాయ రంగానికి కరెంటు కోతలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా భైంసా ట్రాన్స్కో కార్యాలయాన్ని బుధవారం మండలంలోని మహగావ్ గ్రామ రైతులు ముట్టడించారు. గంటపాటు కార్యాలయం ఎదుటే బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వ్యవసాయానికి విద్యుత్ కోతలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల బోర్లు సక్రమంగా నడవక మక్క, జొన్న, నువ్వు పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి.. విద్యుత్ను సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రదీప్ కుమార్ రైతులకు నచ్చచెప్పారు. ఇకపై వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని ట్రాన్స్కో ఏఈ రాంబాబు హామీ ఇవ్వడంతో.. రైతులు తమ ఆందోళన విరమించారు.