యాజమాన్య వైఖరిని నిరసిస్తూ.. డెంటల్ కళాశాల విద్యార్థుల ధర్నా
ABN , First Publish Date - 2022-07-06T05:29:56+05:30 IST
నగర శివారులోని డెంటల్ కళాశాల విద్యార్థులు మంగళవారం ఆందోళన బాటపట్టారు. మూకుమ్మడిగా ధర్నాకు దిగారు.
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: నగర శివారులోని డెంటల్ కళాశాల విద్యార్థులు మంగళవారం ఆందోళన బాటపట్టారు. మూకుమ్మడిగా ధర్నాకు దిగారు. కళాశాల ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని, అవసరమైన సామగ్రి, గ్లౌజులు, బేసిక్ మెటీరియల్స్ తామే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సీనియర్ ఫ్యాకల్టీలు లేరని, ఉన్న కొద్దిమందిని కూడా పలు కారణాలతో తొల గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఆరు మాసాల్లో రిలీవ్ అవుతున్నామని, ఇప్పటికీ తమకు పన్ను కూడా తీయించడం నేర్పించలేదన్నారు. గట్టిగా ప్రశ్నిస్తే సెలవులు ప్రకటించారన్నారు. దీనిపై యాజమాన్యాన్ని అడిగితే ట్రాన్స్ ఫార్మర్ పాడైందని, విద్యుత్ సౌకర్యం లేదని.. ఇలా సంబంధంలేని కారణాలు చెబుతుందని వాపోయా రు. ఇప్పటికే ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా యాజమాన్యంలో మార్పురాలేదన్నారు. విషయం తెలుసుకున్న రూరల్ స్టేషన్ ఎస్ఐ విజయకుమార్.. కళాశాలకు చేరుకొని విద్యార్థులకు సర్దిచెప్పారు. యాజమా న్యం కూడా వారికి నచ్చజెప్పింది. దీంతో విద్యార్థులు ధర్నా విరమించారు.