ఉచిత వైద్యం అందించాలి: సీపీఎం
ABN , First Publish Date - 2022-01-22T05:04:40+05:30 IST
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించి వసతులను పెంచి, మందులను ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
కర్నూలు(హాస్పిటల్), జనవరి 21: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించి వసతులను పెంచి, మందులను ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గదర్శి సభ్యుడు కె.ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి.గౌ్సదేశాయ్ మాట్లాడుతూ పెద్దాసుపత్రిలో ఓపీ మినహాయిస్తే.. అన్నింటికీ యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నీడిల్, గ్లౌజులు కూడా చీటీలు రాసి బయట నుంచి తెప్పిస్తున్నారన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో ఎంపీ, కలెక్టర్, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సమావేశాలు నిర్వహించని అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. హాస్పిటల్కు మంజూరైన నిధులు పక్కదారి పడుతున్నాయని, ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చాలాసార్లు కలెక్టర్, సూపరింటెండెంట్కు విన్నవించినా ఫలితం లేదన్నారు. రోగులను వార్డుకు గానీ, పరీక్షలకు గానీ వీల్ చైర్, స్టెచ్చర్లో తీసుకెళ్లడానికి ఫోన్గానీ, ఆధార్కార్డు గానీ డిపాజిట్ చేస్తేగాని ఇవ్వని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.విజయ్, అబ్దుల్లా, నగర నాయకులు ఆర్.కృష్ణ, నాగస్వాములు, మహమ్మద్, సాల్మన్ రాజు, నాగరాజు, ఐద్వా నాయకురాలు అమీనాబి పాల్గొన్నారు.