పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం విజయవంతం..

ABN , First Publish Date - 2021-02-28T22:51:09+05:30 IST

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఏడాది విజయంతో మొదలుపెట్టింది. ఆదివారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ51 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో..

పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం విజయవంతం..

న్యూఢిల్లీ: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఏడాది విజయంతో మొదలుపెట్టింది. ఆదివారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ51 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ఉన్న ఫస్ట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ఉదయం 10.24కు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. 19 ఉపగ్రహాలతో ఈ రాకెట్‌ రోదసిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగం మొత్తాన్ని ఉదయం 9.50 నుంచి దూరదర్శన్‌, ఇస్రో వెబ్‌సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. బ్రెజిల్‌ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇస్రో, బ్రెజిల్‌ స్పేస్ ఏజెన్సీలు కలిసి తొలి ప్రయోగం చేయడం ఆనందంగా ఉందన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ51 ద్వారా 19 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని వెల్లడించారు. 


పీఎస్‌ఎల్‌వీ-సీ51 విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి కమర్షియల్ లాంచ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇస్రో, ఎన్‌ఎస్‌ఐల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అంతరిక్ష సంస్కరణల్లో కొత్తశకం ప్రారంభమైందని, 19 ఉపగ్రహాల ప్రయోగం కొత్త ఆవిష్కరణలకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోని యువత తయారుచేసిన 4 చిన్న చిన్న ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం చాలా గర్వకారణమని, ఇది దేశ యువత గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఉపగ్రహం ద్వారా  ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో, భగవద్గీత కాపీ కూడా అంతరిక్షంలోకి చేరింది.







Updated Date - 2021-02-28T22:51:09+05:30 IST