నేడే పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం
ABN , First Publish Date - 2021-02-28T09:41:20+05:30 IST
ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్సఎల్వీ-సీ51ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రయోగం కోసం శనివారం
ఉదయం 10.24 గంటలకు 19 ఉపగ్రహాలతో నింగిలోకి
కౌంట్డౌన్ ప్రారంభం.. శ్రీవారి పాదాల చెంత నమూనా
తిరుమలలో పూజలు.. అంతరిక్షంలోకి మోదీ ఫొటో.. భగవద్గీత!
పీఎస్ఎల్వీ మిషన్లో ఏటీఎల్!
ఇస్రోతో కలిసి పనిచేస్తున్న హైదరాబాద్ ఏరోస్పేస్ సంస్థ
కీలక పరికరాలు తయారు చేస్తున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్
ఇస్రోకు ధన్యవాదాలు తెలిపిన సీఎండీ సుబ్బారావు
తిరుమల/శ్రీహరికోట, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్సఎల్వీ-సీ51ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రయోగం కోసం శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. 25.30 గంటల అనంతరం అంటే ఆదివారం ఉదయం 10.24కు కౌంట్డౌన్ జీరోకు చేరుకోగానే 19 ఉపగ్రహాలతో ఈ రాకెట్ రోదసిలోకి దూసుకుపోనుంది. ప్రయోగానంతరం పీఎ్సఎల్వీ-సీ51 రాకెట్ 1.55 గంటలపాటు రోదసిలో పయనించనుంది. బయలుదేరిన 17.23 నిమిషాలకు బ్రెజిల్కు చెందిన 637 కిలోల అమెజోనియ-1 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన ధృవకక్ష్య(సన్ సింక్రనైజ్ పోలార్ ఆర్బిట్)లోకి చేరవేయనుంది. అనంతరం నాలుగు నిమిషాలలో మిగిలిన 18 బుల్లి ఉపగ్రహాలను కక్ష్యల్లో వదిలిపెట్టనుంది. ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆదివారం ఉదయం 9.50 నుంచి దూరదర్శన్, ఇస్రో వెబ్సైట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇస్రో చైర్మన్ శివన్, శాస్త్రవేత్తలు శనివారం పీఎ్సఎల్వీ-సీ51 నమూనాతో తిరుపతి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
ఉపగ్రహాలు ఇవీ..
- అమెజోనియా-1: ప్రయోగంలో ఇదే ప్రధాన ఉపగ్రహం. భూ పరిశీలన కోసం బ్రెజిల్కు చెందిన నేషనల్ ఇనిస్ట్యిటూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ దీనిని తయారుచేసింది. అమెజాన్ అడవుల పరిశోధనతో పాటు బ్రెజిల్లో వ్యవసాయ భూముల సమాచార సేకరణకు ఉపయోగపడనుంది. నాలుగేళ్లు పనిచేస్తుంది.
- అమెరికాకు చెందిన 12 స్పేస్ బీస్ ఉపగ్రహాలు, ఎస్ఏఐ-1 నానో కనెక్టివిటీ-2 ఉపగ్రహం.
- డీఆర్డీవో ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన సింధునేత్ర ఉపగ్రహం
- చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జి ఇండియా విద్యార్థులతో రూపొందింపజేసిన సతీష్ ధవన్ శాట్(ఎస్డీ శాట్). ఈ నానో ఉపగ్రహాన్ని రేడియేషన్ తరంగాలు, వాతావరణ పరిశోధనకు రూపొందించారు. దీనిలో ప్రధాని మోదీ ఫొటో, ఎస్డీ కార్డులో భగవద్గీత, 25 వేల మంది పేర్లు పంపనున్నారు.
- శ్రీపేరంబుదూర్లోని జెప్పియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు తయారుచేసిన జేఐటీశాట్, కోయంబత్తూరులోని త్రిశక్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించిన త్రిశక్తి శాట్, నాగపూర్లోని జీహెచ్ రీరైసోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారుచేసిన జీహెచ్ఆర్సీఈలను కలిపి యూనిటీశాట్గా ప్రయోగిస్తున్నారు. రేడియో తరంగాల ప్రసారాలకు ఉపయోగపడేలా వీటిని రూపొందించారు.
ఉపగ్రహం.. నలుగురు తెలుగు విద్యార్థులు
తిరుపతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పీఎ్సఎల్వీ-సీ51 రాకెట్లో పంపనున్న 19 ఉపగ్రహాల్లో ఒకటైన సతీశ్ ధావన్ శాట్ను రూపొందించింది ఏడుగురు విద్యార్ధులు. వీరిలో యజ్ఞసాయి, రఘుపతిది తిరుపతి. కీర్తిచంద్ హైదరాబాద్ వాసి, అబ్దుల్ కషిఫ్ నల్లగొండకు చెందినవాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యజ్ఞసాయి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. రఘుపతి హమాలీ కుమారుడు. ఎంటెక్ చేశాడు. వీరంతా.. అంతరిక్షం పట్ల ఆసక్తి గలవారికి శిక్షణనిచ్చే స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థలో చేరారు. 2017లో కలాం శాట్ను, 2018లో కలాం శాట్-వి2ను ఈ సంస్థ ఇస్రోతో కలిసి అంతరిక్షంలోకి పంపింది. సంస్థ సీఈవో కేశన్ నేతృత్వంలో ఏడుగురు విద్యార్థులు 1.9 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది పూర్తిగా కమ్యూనికేషన్ ఉపగ్రహం. భూమికి 530 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతుంది. తక్కువ పవర్తో ఎక్కువ డేటా వినియోగంపై పరిశోధనలు చేస్తుంది.
పీఎస్ఎల్వీ మిషన్లో ఏటీఎల్!
హైదరాబాద్, ఫిబ్రవరి 27: పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎ్సఎల్వీ).. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఉపగ్రహ ప్రయోగాల్లో అత్యంత కీలకమైనది, నమ్మకమైనది. ప్రతిష్ఠాత్మకమైన పీఎ్సఎల్వీ మిషన్లో హైదరాబాద్కు చెందిన ‘అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్)’ భాగస్వామిగా ఉంది. ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎ్సఎ్ససీ)తో ఏటీఎల్కు సుదీర్ఘకాలంగా ఒప్పందం ఉంది. వీఎ్సఎ్ససీ ఇంజనీర్ల బృందాల మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది. ఏటీఎల్ వివిధ ఫ్లైట్ సిస్టంలు, దశలు, వాటి టెస్టింగ్లను చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ పావులూరి సుబ్బారావు తెలిపారు. కీలకమైన పీఎ్సఎల్వీ మిషన్లో తొలిసారిగా భారతీయ ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థ అయిన ఏటీఎల్ సేవలను వినియోగించుకుంటోందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో కీలకమైన కార్యకలాపాల్లో స్వదేశీ ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచాలన్న ఇస్రో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఏటీఎల్ మూడు దశాబ్దాలుగా ఇస్రోకు నమ్మకమైన భాగస్వామిగా పనిచేస్తోందన్నారు. తమ సంస్థను విశ్వసిస్తున్న, ప్రోత్సహిస్తున్న ఇస్రోకు సుబ్బారావు ధన్యావాదాలు తెలియజేశారు. ఇస్రోకు సంబంధించిన వాహకనౌకలు, ఉపగ్రహాలు, స్పేస్క్రాఫ్ట్ పేలోడ్లు, గ్రౌండ్ సిస్టమ్స్లకు అవసరమైన ఎలకా్ట్రనిక్స్, మెకానికల్ సబ్ సిస్టమ్లను ఏటీఎల్ తయారు చేస్తోందని వివరించారు.
కీలకమైన ఏరోస్పేస్ సబ్ సిస్టమ్లను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉందని, కేరళలోని తిరువనంతపురంలో ప్రత్యేక కేంద్రం ఉందని చెప్పారు. అక్కడి నుంచి ఇస్రోకు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, అత్యాధునిక ఎలకా్ట్రనిక్ ప్యాకేజీల సరఫరా, కంప్యూటర్ సిస్టమ్స్, వాహక నౌకలకు చెందిన వివిధ సబ్ సిస్టమ్స్ తయారీలో అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులో స్పేస్క్రాఫ్ట్ తయారీకి గాను భారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తాము దాదాపు 30 ఏళ్లలో ఇస్రోకు చెందిన 66 వాహకనౌకలు, 88 స్పేస్క్రా్ఫ్టలకు ఎలాంటి లోపాలు లేని పరికరాలను తయారు చేసి అందించినట్లు సుబ్బారావు తెలిపారు. ఐరోపా, అమెరికా, రష్యాలకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీలతోనూ ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. తాజాగా అమెరికాకు చెందిన శాటర్న్ శాటిలైట్ నెట్వర్క్స్ (ఎస్ఎస్ఎన్)తో అత్యాధునికమైన ఉపగ్రహాల (సూక్ష్మ-మధ్య పరిమాణం) తయారీకి సంబంధించి సంయుక్త వెంచర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఉపగ్రహాలు భారత్ ప్రయోగించనున్న పీఎ్సఎల్వీ, ఎస్ఎ్సఎల్వీలకు సరిపోతాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఏటీఎల్ దేశ అంతరిక్ష కార్యకలాపాల్లో ఇస్రోతో కలిసి మరింత సమర్థంగా పనిచేస్తుందని సుబ్బారావు తెలిపారు.