PUBG ఆడొద్దన్నందుకు తల్లిని చంపిన కొడుకు కేసులో వెలుగులోకి మరో దారుణ నిజం.. 10 గంటల పాటు ఆమె కొనఊపిరితో ఉన్నా..

ABN , First Publish Date - 2022-06-10T17:24:50+05:30 IST

పబ్జీ గేమ్ ఆడనివ్వలేదన్న కోపంతో లక్నోకు చెందిన 16 ఏళ్ల బాలుడు తల్లి ప్రాణాలు తీసిన ఘటన సంచలనంగా మారింది.

PUBG ఆడొద్దన్నందుకు తల్లిని చంపిన కొడుకు కేసులో వెలుగులోకి మరో దారుణ నిజం.. 10 గంటల పాటు ఆమె కొనఊపిరితో ఉన్నా..

పబ్జీ గేమ్ ఆడనివ్వలేదన్న కోపంతో లక్నోకు చెందిన 16 ఏళ్ల బాలుడు తల్లి ప్రాణాలు తీసిన ఘటన సంచలనంగా మారింది. తిండి, నిద్ర మాని నిరంతరం గేమ్ ఆడుతుండటంతో ఆ బాలుడిని తల్లి పలుమార్లు మందలించింది. దీంతో తల్లి మీద తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు ఇంట్లో ఉన్న తండ్రి లైసెన్స్డ్ రివాల్వర్తో శనివారం అర్ధరాత్రి ఆమెపై కాల్పులు జరిపాడు. తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు వదిలింది. అయితే తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లిన తర్వాత కూడా ఆమె 10 గంటల పాటు బతికే ఉందట. ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కొడుకు మనసు కరగలేదు.


ఇది కూడా చదవండి..

ఏం తల్లివమ్మా.. హోం వర్క్ చేయలేదని 5 ఏళ్ల కూతురి కాళ్లు చేతులు కట్టేసి డాబాపై మండుటెండలో..


తాజాగా పోలీసుల విచారణలో ఆ బాలుడు సంచలన విషయాలు చెప్పాడు. `మా అమ్మ, చెల్లి పక్కపక్కన పడుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో అల్మారాలో నుంచి పిస్టల్ తీశా. నేరుగా మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె తలకు గురి పెట్టి కాల్చా. ఆ శబ్దానికి మా చెల్లి నిద్ర లేచింది. ఆమె కళ్లు మూసి నా వైపు తిప్పాను. బుల్లెట్ పేలిన వెంటనే తల్లి తలలోంచి రక్తం ధారగా కారడం మొదలైంది. అనంతరం చెల్లిని తీసుకుని మరో గదిలోకి వెళ్లి, ఈ గది తలుపులు వేసేశాను. తలలో బుల్లెట్ ఉన్నా మా అమ్మ వెంటనే చనిపోలేదు. రక్తం కారుతుండగా ఏడుస్తూ ఉంది. గంటకో సారి నా గదిలో నుంచి అమ్మ ఉన్న గదిలోకి వెళ్లేవాడిని. ఆమె ఊపిరి ఆగిపోయిందో, లేదో గమనించేవాడిని. అలా గంటకోసారి వెళ్లి మొత్తం 8 సార్లు ఆమె ఊపిరి ఆగిపోయిందో, లేదో చూశాను. తర్వాతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లగా ఆమ్మ శరీరంలో ఎలాంటి కదలికా లేదు. ఊపిరి ఆగిపోయింది. అప్పుడు ఆమె చనిపోయిందని నమ్మకం కలిగింద`ని ఆ బాలుడు పోలీసుల విచారణలో చెప్పాడు. 


కాల్పులు జరిపిన తర్వాత తల్లిని ఆ కొడుకు హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఉంటే కచ్చితంగా బతికేదని పోలీసులు చెబుతున్నారు. తల్లిని హత్య చేసిన అనంతరం సదరు బాలుడు ఆమె శవాన్ని మూడ్రోజులు ఇంట్లోనే దాచిపెట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని తొమ్మిదేళ్ల చెల్లెలిని బెదిరించాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా రూం ఫ్రెషనర్ ఉపయోగించాడు. మూడ్రోజులుగా భార్య ఫోన్లో మాట్లాడకపోవడంతో బెంగాల్‌లో విధులు నిర్వరిస్తున్న భర్తకు అనుమానం కలిగింది. కొడుకును అడగడంతో బాలుడు షాకింగ్ విషయం చెప్పాడు. ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్ తల్లిని కాల్చి చంపాడని కట్టుకథ వినిపించాడు. పోలీసులకు కూడా అలాగే చెప్పాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఆ బాలుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-06-10T17:24:50+05:30 IST