ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-07-27T05:51:18+05:30 IST
ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి నిబంధనల మేరకు వాటిని సత్వరమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఇలాక్కియా అధికారులను ఆదేశించారు.
- స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఇలాక్కియా
రాజమహేంద్రవరం అర్బన్, జూలై 26: ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి నిబంధనల మేరకు వాటిని సత్వరమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఇలాక్కియా అధికారులను ఆదేశించారు. అలాగే స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. అర్జీదారులతో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ చాలా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని, డివిజన్స్థాయిలో సమస్యలను మాత్రమే తమకు తెలియజేయాలని సూచించారు. సుమారు 25 మంది అర్జీదారులు తమ సమస్యలను రాతపూర్వకంగా సబ్ కలెక్టర్కు అందజేశారు. వివిధ సంక్షేమ పథకాల లబ్ధి తమకు అందలేదని, భూ వివాదాలు, స్థలాల తగాదాలు, సామాజిక భద్రత పింఛన్లు, రేషన్కార్డుల మంజూరు, నివేశన స్థలం వంటి ఫిర్యాదులు ప్రజల నుంచి అందాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనా అధికారి దేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ రూరల్ మండలం కాతేరులో మెగా వ్యాక్సినేషన్ను పరిశీలించారు.