ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-10-26T07:22:23+05:30 IST
జిల్లాలోని ప్రజలు వివిధ సమస్య లపై అందించే ప్రజావాణి దరఖాస్తులపై సంబంధిత శాఖాధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి అన్నారు.
సూర్యాపేట(కలెక్టరేట్), అక్టోబరు 25: జిల్లాలోని ప్రజలు వివిధ సమస్య లపై అందించే ప్రజావాణి దరఖాస్తులపై సంబంధిత శాఖాధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ధరఖాస్తులను స్వీకరించిన అనంతరం అధికారులతో మాట్లా డారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, భూ వివాదాల దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలను రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్ నూరుశాతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణికి మొత్తం 60 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో పీడీ కిరణ్కుమార్, సీపీవో వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, డీఏవో రామారావు, డీపీవో యాదయ్య, శిరీష, ఏవో శ్రీదేవి పాల్గొన్నారు.
ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలి: ఎస్పీ
సూర్యాపేట క్రైం: ఫిర్యాదుదారులకు పోలీసులు భరోసా కల్పించాలని ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ అన్నారు. గ్రీవెన్డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని, చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వాహనాలను జాగ్రత్తగా నడపాలని, రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. వృద్ధ తల్లిదండ్రులపై వారసులు బాధ్యతగా ఉండాలన్నారు. గ్రీవన్స్ డేలో మొత్తం 20 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
పోలీసు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాం
పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ అన్నారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగేశ్వర్రావు మృతిచెందగా, ఆయన కుటుంబానికి పోలీస్ భద్రత పథకం చెక్కును అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్గౌడ్, సూపరింటెండెంట్ శ్రీకాంత్ పాల్గొన్నారు.