Public Examsలకు 26.76 లక్షల మంది
ABN , First Publish Date - 2022-05-03T15:30:51+05:30 IST
రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో టెన్త్, ప్లస్ వన్, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలకు 26.76 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ విషయమై ప్రభుత్వ పరీక్షల శాఖ విడుదల
పెరంబూర్(చెన్నై): రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో టెన్త్, ప్లస్ వన్, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలకు 26.76 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ విషయమై ప్రభుత్వ పరీక్షల శాఖ విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 5న ప్రారంభమై 28వ తేది వరకు, టెన్త్ పరీక్షలు 6 నుంచి 30వ తేది, ప్లస్ వన్ పబ్లిక్ పరీక్షలు 10న ప్రారంభమై 30వ తేదీ వరకు జరుగుతున్నాయని తెలిపింది. ప్లస్ టూ పరీక్షల కోసం 3,119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయగా, 3,98,321 మంది విద్యార్థులు, 4,38,996 మంది సహా మొత్తం 8,37,317 మంది హాజరుకానున్నారు. అలాగే, టెన్త్ పరీక్షల కోసం 3,936 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయగా, 4,86,887 మంది విద్యార్థులు, 4,68,586 మంది విద్యార్థినులు కలిపి మొత్తం 9,55,474 మంది హాజరుకానున్నారు. ఇక, ప్లస్ వన్ పరీక్షల కోసం 3,119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయగా, 4,33,684 మంది విద్యార్థులు, 4,50,198 మంది విద్యార్థినుల సహా మొత్తం 8,83,884 మంది హాజరుకానున్నారు. అలాగే, ముగ్గురు హిజ్రాలు కూడా పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు 1,000 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.. పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వం సూచించిన కొవిడ్ నిబంధనలు అమలుతో పాటు విద్యుత్ అంతరాయం కలుగకుండా జనరేటర్లు ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతించకపోవడంతో పాటు విద్యార్థులు షూ, బెల్ట్ ధరించేందుకు నిషేధం విధించారు. పరీక్షల్లో కాపీయింగ్కు పాల్పడే విద్యార్థులపై కఠినచర్యలు చేపడతామని ప్రభుత్వ పరీక్ష శాఖ హెచ్చరించింది.
విద్యార్థులకు సెలవులు...
పబ్లిక్ పరీక్షలు రాయనున్న టెన్త్, ప్లస్ వన్, ప్లస్ టూ విద్యార్థుల చివరి తరగతులు సోమవారంతో ముగియగా, మంగళవారం నుంచి సెలవులు ప్రకటించారు. దీంతో, సోమవారం పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఒకరి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక మిగిలిన 1 నుంచి 9వ తరగతి వరకు ఈ నెల 13వ తేది వరకు తరగతులు నిర్వహించడంతో పాటు వార్షిక పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు.