ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన
ABN , First Publish Date - 2021-07-25T05:12:09+05:30 IST
నూతనంగా ఎన్నికైన పంచాయ తీ సర్పంచ్లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించాలని జేసీ కిషోర్కుమార్ సూచించారు. శనివారం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఈ నెల 22న ప్రారంభమైన తొలి విడత సర్పంచ్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.
సర్పంచ్ల శిక్షణలో జేసీ కిషోర్కుమార్
గరుగుబిల్లి, జూలై 24 : నూతనంగా ఎన్నికైన పంచాయ తీ సర్పంచ్లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించాలని జేసీ కిషోర్కుమార్ సూచించారు. శనివారం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఈ నెల 22న ప్రారంభమైన తొలి విడత సర్పంచ్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో ఉత్తమ పాలన అందించేందుకు ఈ శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలు స్థానిక సంస్థలుగా గుర్తింపు పొందా యన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారికి అవి అందేలా శ్రద్ధ చూపాల న్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషక విలువలతో కూడిన బియ్యంపై ఉన్న అపోహలు తొలగించాల న్నారు. ఈ బియ్యం వాడడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన సర్పంచ్లకు ధ్రువపత్రాలు అందించారు. మూడు రోజుల శిక్షణకు మూడు మండలాలకు చెందిన 92 మందికి గాను 73 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ ఎంఎస్ భావ్న, డివిజనల్ అభివృద్ధి అధికారి కె.రాజ్ కుమార్, పార్వతీపురం, కొమరాడ సీతానగరం ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి రెండో విడత ...
డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు రెండో విడత శిక్షణ ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తామని పార్వతీపురం డివిజనల్ అభివృద్ధి అధికారి కె.రాజ్కుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రెండో విడతగా గరుగుబిల్లి, కురు పాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలకు చెందిన 101 మందికి శిక్షణ ఇస్తామన్నారు.