టీడీపీతోనే ప్రజా సంక్షేమం
ABN , First Publish Date - 2021-03-07T05:04:32+05:30 IST
ప్రజా సంక్షేమ పథకాలు టీడీపీతోనే మొదలయ్యాయని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేశామన్నారు. విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 30వ డివిజన్లో శనివారం ప్రచార ర్యాలీ నిర్వహించారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్గజపతిరాజు
విజయనగరం (ఆంధ్రజ్యోతి) మార్చి 6 : ప్రజా సంక్షేమ పథకాలు టీడీపీతోనే మొదలయ్యాయని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేశామన్నారు. విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 30వ డివిజన్లో శనివారం ప్రచార ర్యాలీ నిర్వహించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ టీడీపీ కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటికీ, ప్రతి సెంటుకు పుష్కలంగా నీరు అందించిందన్నారు. అప్పట్లోనే అప్పలకొండమ్మ తాగునీరు పథకం ద్వారా విజయనగరం, పరిసర ప్రాంతాలకు తాగునీరు అందించామని గుర్తుచేశారు. జిల్లాలో తాగు, సాగునీరు కోసం జంఝావతి, గోస్తని, నాగవళి నదుల కాలువలను అభివృద్ధి చేసి జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత కూడా టీడీపీదేనని అన్నారు. ఇప్పుడొచ్చే నాయకులు పిట్టకథలు చెబుతున్నారని, వాటిని నమ్మితే మన బతుకులు కూడా పిట్టకథలుగా మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచిపరిశ్రమలు తరలిపోతున్నాయని, జిల్లాలో కూడా అనేక పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం సామాన్యులు బతికే పరిస్థితి లేదని, నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు ఆకాశనంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావాలని అశోక్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రచారంలో టీడీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జి అదితి గజపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, బొద్దల నర్సింగరావు అభ్యర్థులు, కార్యకర్తలు ఉన్నారు.