పుదుచ్చేరిలో కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. అంధకారంలో కార్యాలయాలు!
ABN , First Publish Date - 2022-10-04T02:58:30+05:30 IST
పుదుచ్చేరి(Puducherry)లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. దీంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో
చెన్నై: పుదుచ్చేరి(Puducherry)లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. దీంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో అంధకారం నెలకొంది. దీంతో సమ్మెలో పాల్గొంటున్న 300 మంది విద్యుత్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 20 మందిపై కేసులు నమోదు చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వం విద్యుత్ శాఖను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. నేటికి (సోమవారం) అది ఆరో రోజుకు చేరింది. దీంతో పుదుచ్చేరి మొత్తంగా చీకట్లు అలముకున్నాయి. గవర్నర్ నివాసం రాజ్భవన్తో పాటు సామాన్యుల గృహాల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.
ఎస్మా ప్రయోగిస్తాం
ఇదిలావుంటే, సమ్మెకు దిగిన ఉద్యోగులపై అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మాను ప్రయోగిస్తామని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్, రాష్ట్ర విద్యుత్ మంత్రి సౌందర్రాజన్ హెచ్చరించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. అంతేకాకుండా, ఆదివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగిన 300 మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఉద్యోగులను బస్సుల్లో పోలీస్ గ్రౌండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పుదుచ్చేరిలో స్ట్రైకింగ్ ఫోర్స్
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కల్పించేందుకు వీలుగా చెన్నై ఆవడిలోని పారా మిలిటరీ బలగాల్లోని స్ట్రైకింగ్ ఫోర్స్ను ఆదివారం రాత్రి హుటాహుటిన పుదుచ్చేరికి రప్పించారు. వీరు పుదుచ్చేరిలో అడుగుపెట్టగానే కవాతు నిర్వంచారు. అలాగే, విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద పహారా కాస్తున్నారు. విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆందోళనకు దిగిన సిబ్బందిని బలవంతంగా అక్కడ నుంచి తరలించారు.