‘అప్పు’కు అడుగడుగునా నీరాజనం
ABN , First Publish Date - 2022-03-18T17:38:53+05:30 IST
కర్ణాటక రత్న, పవర్స్టార్ పునీత్రాజ్కుమార్ తొలి జయంతి రాష్ట్రమంతటా అభిమానం వెల్లువెత్తింది. అడుగడుగునా పునీత్ రాజ్కుమార్కు ప్రజలు నీరాజనం పట్టారు.
- పునీత్ రాజ్కుమార్ తొలి జయంతికి కదలివచ్చిన అభిమానులు
- చివరి సినిమా ‘జేమ్స్’ జైత్రయాత్ర
బెంగళూరు: కర్ణాటక రత్న, పవర్స్టార్ పునీత్రాజ్కుమార్ తొలి జయంతి రాష్ట్రమంతటా అభిమానం వెల్లువెత్తింది. అడుగడుగునా పునీత్ రాజ్కుమార్కు ప్రజలు నీరాజనం పట్టారు. ఇటీవలే పునీత్రాజ్కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. తొలి జయంతి రోజునే పునీత్ నటించిన చివరిచిత్రం ‘జేమ్స్’ సినిమా విడుదల చేశారు. ఓ వైపు జయంతి, మరోవైపు చివరి సినిమాను వీక్షించేందుకు అభిమానులు క్యూ కట్టారు. పునీత్రాజ్కుమార్ సమాధికి భార్య అశ్వినితోపాటు కుటుంబ సభ్యులు శివరాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్లు ప్రత్యేక పూజలు జరిపారు. గురువారం ఉదయం కంఠీరవా స్టూడియోకు కుటుంబీకులు చేరుకున్నారు. అక్కడ అరగంటకుపైగా ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే అభిమానులు సమాధిని దర్శించుకునేందుకు బెంగళూరు వాసులేకాకుండా వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చారు. సమాధి ప్రాంతంలో ప్రత్యేక జెట్ విమానం ద్వారా పునీత్కు నివాళి అర్పించారు. నగరవ్యాప్తంగా జెట్ చక్క ర్లు కొట్టింది. దేశవ్యాప్తంగా నాలుగువేల టాకీ్సలలో జేమ్స్ విడుదలైంది. రాజ్కుమార్ కుటుంబీకులు సంగం సినిమా హాల్లో అభిమానులతో కలసి సినిమాను వీక్షించారు. సంగం టాకీసుకు వచ్చిన శివరాజ్కుమార్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా శివరాజ్ మీడియాతో మాట్లాడుతూ సినిమాకు డబ్బింగ్ చెప్పేవేళ మానసికంగా ఆవేదనకుల లోనయ్యానన్నారు. అప్పు లేకుండా జయంతి జరుపుకోవడం దుఃఖంగా ఉందన్నారు. అయితే జీవనం ఉన్నట్టు నడుచుకోవాలన్నారు. పునీత్ లేకుండా సినిమా విడుదలైందని, చూస్తుంటే ఎందుకు ఇలా ఉన్నామా..? అనిపిస్తోందని విచారం వ్యక్తం చేశారు. అప్పు మాతో లేరని ఎలా ఊహించుకోవాలని సోదరుడు రాఘవేంద్ర రాజ్కుమార్ భావోద్వేగంతో మాట్లాడారు. పునీత్ తొలి జయంతి సందర్భంగా బెంగళూరులోని ప్రతి వీధిలోనూ కటౌట్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేసి సంబరాలు చేశారు. పలుచోట్ల పునీత్ హోర్డింగ్లకు పాలాభిషేకం చేశారు. నగరవ్యాప్తంగా వేలాది ప్రాంతాలలో అన్నదానం జరిగింది. లక్షలాదిమంది జయంతి వేడుకలలో భాగస్వామ్యులయ్యారు.