భార్య వేధింపులకు 21 కిలోల బరువు కోల్పోయిన భర్త... విడాకులు మంజూరు చేసిన కోర్టు!

ABN , First Publish Date - 2021-09-09T17:31:44+05:30 IST

హరియాణాలోని హిసార్‌కు చెందిన ఒక వ్యక్తి పెళ్లయిన...

భార్య వేధింపులకు 21 కిలోల బరువు కోల్పోయిన భర్త... విడాకులు మంజూరు చేసిన కోర్టు!

హిసార్: హరియాణాలోని హిసార్‌కు చెందిన ఒక వ్యక్తి పెళ్లయిన తరువాత భార్య వేధింపుల కారణంగా 21 కిలోల బరువు కోల్పోయాడు. దీని ఆధారంగా కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ కేసులో హసార్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును పంజాబ్, హరియాణా కోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే.... భార్య తనను మానసికంగా వేధిస్తున్న కారణంగా... 74 కిలోలు ఉన్న తన శరీర బరువు 53 కిలోలకు తగ్గిపోయిందని, తనకు భార్య నుంచి విడాకులు కావాలని ఒక దివ్యాంగుడు కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ దివ్యాంగునికి వినికిడి లోపం ఉంది. ఇతను హిసార్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, హైకోర్టును ఆశ్రయించాడు. 


దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అతని భార్య ఆరోపణలు నిరాధారమైనవని తేల్చిచెప్పింది. హిసార్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేస్తూ, ఆ దివ్యాంగునికి అనుకూలంగా తీర్పునిస్తూ, ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ తన భార్య తనను మానసికంగా హింసించేందని, సామూహికంగా జరిగే ఉత్సవ కార్యక్రమాలకు తనను రానిచ్చేది కాదని, ప్రతీ చిన్న విషయానికీ తనతో గొడవ పడేదని తెలిపారు. తనకు వివాహం అయ్యేనాటికి 74 కిలోల బరువు ఉండేవాడినని, ఆ తరువాత తన బరువు 53 కిలోలకు చేరుకున్నదన్నాడు. భార్య వేధింపుల నుంచి విముక్తి పొందేందుకే తాను విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కానని తెలిపారు. 


Updated Date - 2021-09-09T17:31:44+05:30 IST