పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ABN , First Publish Date - 2022-02-18T23:04:11+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ

పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

చండీగఢ్ : పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 1 లక్ష ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తామని, మహిళలకు నెలకు రూ.1,100 చొప్పున ఇస్తామని, వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చింది. మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాల కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, మాఫియాను అంతం చేస్తామని తెలిపింది. 


పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, నూనె గింజలు, చిరు ధాన్యాలు, జొన్నలను రైతుల నుంచి నేరుగా ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయని చెప్పారు. 


ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1 లక్ష ప్రభుత్వోద్యోగాల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఈ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సంవత్సరానికి ఎనిమిది వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని తెలిపింది. గృహిణులకు ఆర్థిక సాయం పథకం క్రింద నెలకు రూ.1,100 చెల్లిస్తామని వాగ్దానం చేసింది. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్ జిత్ సింగ్ చన్నీ. 


Updated Date - 2022-02-18T23:04:11+05:30 IST