cyber crime కేసులో బీజేపీ నేత తజీందర్ బగ్గా అరెస్ట్
ABN , First Publish Date - 2022-05-06T15:49:15+05:30 IST
cyber crime కేసులో నిందితుడైన బీజేపీ నేత తజీందర్ బగ్గాను పంజాబ్ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు....
న్యూఢిల్లీ: cyber crime కేసులో నిందితుడైన బీజేపీ నేత తజీందర్ బగ్గాను పంజాబ్ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు.భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని, పుకార్లు వ్యాప్తి చేశారని, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆప్ నేత సన్నీ సింగ్ ఫిర్యాదు చేయడంతో అతనిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 30వతేదీన జరిగిన నిరసన ప్రదర్శనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుదారుడు బగ్గా చేసిన ప్రకటనలు, వీడియో క్లిప్లను పోలీసులకు సమర్పించారు.బగ్గా అరెస్టును బీజేపీ ఖండించింది.
‘‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు పంజాబ్లో తన పార్టీ రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటు. ఈ సంక్షోభ సమయంలో ఢిల్లీలోని ప్రతి పౌరుడు తేజేంద్ర పాల్ సింగ్ బగ్గా కుటుంబానికి అండగా నిలుస్తారు’’ అని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి చెప్పారు. తజీందర్ బగ్గాను 50 మంది పంజాబ్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా చెప్పారు.