14 కాదు 20
ABN , First Publish Date - 2022-01-18T06:59:16+05:30 IST
వచ్చే 16న గురు రవిదాస్ జయంతి ఉన్నందున పంజాబ్ ఎన్నికలను
- ఫిబ్రవరి 20కి పంజాబ్ ఎన్నికలు వాయిదా
- 16న గురు రవిదాస్ జయంతి వల్లే..
- వాయిదా కోరిన రాజకీయ పార్టీలు
- అంగీకరిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం
- బీజేపే నేతలకు కేంద్రం వీఐపీ భద్రత
న్యూఢిల్లీ/చండీగఢ్, జనవరి 17: వచ్చే 16న గురు రవిదాస్ జయంతి ఉన్నందున పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీలు చేసిన విన్నపాన్ని అంగీకరిస్తూ ఎన్నికల కమిషన్ వచ్చే 20కు ఎన్నికలను వాయిదా వేసింది. పంజాబ్లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని ఈసీ తొలుత నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే ప్రతి ఏటా గురు రవిదాస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో వారాణసీకి వెళుతుంటారని, ఈసారి కూడా అలాగే వెళ్లనున్నందున.. ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోతారంటూ పంజాబ్ సీఎం చరణ్జిత్సింగ్ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ఆపై బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని కోరడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఈసీ నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి.
ఇదిలా ఉండగా.. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకు వీఐపీ భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ యోచిస్తోంది. వీరితోపాటు ఆర్ఎ్సఎస్ నేతలు, మరికొన్ని మతసంస్థల నేతలకు కూడా ఈ భద్రత కల్పించనుంది. భారత్లో ఎన్నికలను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్కు చెందిన ఐఎ్సఐ ప్రేరేపిత ఉగ్రమూకలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో కేంద్రం ఈ ఏర్పాట్లు చేస్తోంది.