పంజాబ్ ప్రభుత్వం యూ-టర్న్.. VVIP లకు భద్రత పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-06-02T21:57:03+05:30 IST

సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యోదంతం నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది.

పంజాబ్ ప్రభుత్వం యూ-టర్న్.. VVIP లకు భద్రత పునరుద్ధరణ

చంఢీగడ్ : సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యోదంతం నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. 424 మందికిపైగా వీవీఐపీలకు భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 7 నుంచి వీవీఐపీలకు సెక్యూరిటీ అందుబాటులోకి వస్తుందని పంజాబ్, హర్యానా హైకోర్టుకు ఆప్  ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. భద్రత తొలగింపుపై మాజీ మంత్రి ఓపీ సోనీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు చెప్పింది. 


వీవీఐపీలకు భద్రత ఎందుకు తొలగించాల్సి వచ్చిందని హైకోర్ట్ ప్రశ్నించగా... జూన్ 6న ‘ ఆపరేషన్ బ్లూస్టార్’ వార్షికదినం నేపథ్యంలో భద్రతా సిబ్బంది అవసరం ఏర్పడిందని ఆప్ ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకుంది. కాగా 1984లో ‘స్వర్ణ దేవాలయం’లో తిష్టవేసిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ‘ఆపరేషన్ బ్లూస్టార్’  నిర్వహించిన విషయం విధితమే.

సిద్దూ హత్య జరిగిన 5 రోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  వీవీఐపీలకు భద్రత ఉపసంహరించడం.. ఆ మరుసటి రోజే సింగర్ సిద్ధూ దారుణ హత్యకు గురయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఆందోళనలు చేపట్టాయి. భద్రత ఉపసంహరణ నిర్ణయంపై పెద్ద వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఆప్ ప్రభుత్వం ఈ వెనుకడుగువేసింది.

Updated Date - 2022-06-02T21:57:03+05:30 IST