
లుథియానా (పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా నగరంలో ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు.లుథియానా సివిల్ హాస్పిటల్లోని తల్లీ, పిల్లల ఆసుపత్రి ఆవరణలో లూథియానా జిల్లా పాలనా యంత్రాంగం తల్లి పాల బ్యాంకును ప్రారంభించింది.ఇక్కడ ఆరోగ్య కార్యకర్తలు తల్లిపాలను నవజాత శిశువులకు ఇస్తారు. పిల్లలు పుట్టిన మొదటి గంటలోపు చనుబాలివ్వక పోవడం వల్ల తల్లులకు పుండ్లు పడుతున్నాయని వైద్యులు చెప్పారు. తల్లీ పాల బ్యాంకును కౌన్సిలర్ మమతా అషు,ఏడీసీ డెవలప్మెంట్ అధికారి అమిత్ కుమార్ పంచల్, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ హర్జీందర్ సింగ్ బేడీలు ప్రారంభించారు.
శిశువులు పుట్టిన వెంటనే తల్లి పాలను ఆరోగ్య కార్యకర్తలు అందిస్తారని వైద్యులు చెప్పారు.తల్లిపాలను సంరక్షించడానికి ఒక కంటైనర్ తోపాటు రెండు విద్యుత్ పంపులు, 10 మాన్యువల్ పంపులు, 16 కంటైనర్లు ఒక స్టెరిలైజర్ ఏర్పాటు చేశారు.పిల్లలు పుట్టిన మొదటి గంటలోపు నుంచి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించవచ్చని వైద్యులు చెప్పారు, తల్లి పాలు శిశువులకు ఆదర్శవంతమైన ఆహారమని, ఇది సురక్షితం, పరిశుభ్రమైనదని వైద్యులు చెప్పారు.