"కౌశల దేశంలో ఒక ఊరి చివర అడవిలో ఒక స్వామీజీ ఉండేవాడు. ఆయన మహా జ్ఞాని. ఆయన గొప్పతనానికి ముగ్ధులై .. ఊరిలోని అందరూ ఆయనకి ఆశ్రమం కట్టారు. ఆయన ఒక్కరే అక్కడ ఉండేవారు. అప్పుడప్పుడు అందరూ వచ్చి.. ఆయన చెప్పేది విని వెళ్లిపోయేవారు. ఆయనకి రోజూ ఉదయం ఒక్క అరటిపండు మాత్రమే తినే అలవాటు. ఆ అరటిపండు దేవుడి దగ్గర పెట్టి.. పూజ అవ్వగానే బట్టలు మార్చుకుని వచ్చేసరికి.. ఆ ఒక్క అరటిపండుని.. ఒక ఎలుక తినేసింది. స్వామీజీవారికి కోపమెచ్చింది. ఇలా ప్రతిరోజు ఆ అరటిపండుని ఎలుక తినేయడం మొదలుపెట్టింది. ఒకరోజు స్వామీజీవారికి సహనం నశించింది. దానిని ఎలాగైనా చంపడం కోసం.. ఒక పిల్లిని పెంచుదాం.. అనే ఆలోచన వచ్చింది. స్వామీజీవారి కోరిక మేరకు ఊరిలోని వారు ఒక పిల్లిని అక్కడ వదిలేశారు. మరి పిల్లికి పాలు ఎలా? స్వామీజీవారికి ఒక ఆవు ఉంటే మంచిది అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఊరి వారు ఆవును తీసుకొచ్చి అక్కడ కట్టేశారు. అలాగే ఆ ఆవును చూసుకోవడానికి బాబ్జీ అనే కుర్రాడిని కూడా పెట్టారు. ఈ ఎలుక మాత్రం ఇంకా దొరకడం లేదు.
ఒక రోజు ఆవును చూసుకునే బాబ్జీకి జ్వరం వచ్చింది. మరి ఆవుకి గడ్డి ఎవరు వేస్తారు? పేడ ఎవరు తీస్తారు? పాపం స్వామీజీ ఇబ్బంది పడకూడదని.. ఊరిలోని వారు.. బాబ్జీ వాళ్ల అక్కని పంపించారు. వాడి అక్క పేరు మోహిని. చక్కని పిల్ల. పైగా వయసులో ఉంది. ఒక వర్షం కురిసిన పగలు, ఆవును కట్టేసి, తడిసిన పైట పిండుకుంటుంది మోహిని. ఆ దృశ్యం స్వామీజీ చూశాడు. మనసు చలించింది. మెల్లగా మోహినినీ లోపలకు లాగారు. మ్యూజిక్ మొదలైంది. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు వాళ్ల తమ్ముడికి జ్వరం వచ్చినా, రాకపోయినా.. మోహిని మాత్రం ఆశ్రమానికి వస్తూ, పోతూ.. రహస్యంగా స్వామీజీ వారికి సేవలు చేసుకునేది. కానీ ఒకరోజు ఆ అమ్మాయి నెలతప్పడంతో.. ఊరిలో అందరికీ ఈ సేవల గురించి తెలిసిపోయింది. కోపంతో మోహిని తండ్రి వచ్చి.. స్వామీజీ గడ్డం పట్టుకుని ఆశ్రమంలో నుంచి బయటికి లాగాడు. అందరూ వచ్చి పెద్ద గొడవ చేసి.. ఆ పిల్లను స్వామీజీకిచ్చి అదే రాత్రి పెళ్లి చేసేశారు. శోభనం రాత్రి ఈ బాజ్జీగాడు ఆశ్రమం బోర్డ్ పీకేశాడు. నాలుగు రోజుల తర్వాత మోహిని, వాళ్ల అమ్మ, నాన్న, తమ్ముడు బాజ్జీ ఆశ్రమానికి షిఫ్ట్ అయిపోయి.. అందరూ అక్కడే ఉంటూ.. పక్కనే ఉన్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ.. స్వామీజీని పెద్దకాపుని చేసేశారు. ఆ తర్వాత మోహిని కడుపున పండంటి కొడుకు పుడితే.. వాడికి వీరినాయుడు అని పేరు పెట్టారు. అలా స్వామీజీ కూడా మనలాగే సంసారంలో పడి ****పోయాడు. ఇది కథ.
మోరల్ ఏమిటంటే.. ఏ కష్టం లేకుండా ఖాళీగా ఉన్నప్పుడే మన ఇగో లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే కోపాలు వచ్చేస్తాయ్. అలాంటప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మన కొంపలు ముంచేస్తాయ్. అసలు ఎలుక అరటిపండు తింటే తప్పేముంది. అది కూడా ప్రాణే కదా. ఒకటి అరటిపండు కాకపోతే రెండు పెట్టు పూజలో. ఇద్దరూ చెరొకటి తింటే అయిపోతుంది. దానికి కోపం. ఆ అనవసరపు కోపం వల్ల.. తెలియకుండా మన ట్రైయిన్ వేరే పట్టాలు ఎక్కేస్తుంది. చాలా దూరం వెళ్లాక కానీ తెలియదు.. ఎటు వెళ్దాం అనుకున్నాం.. ఎటు పోయాం అనేది. ఇన్ని దరిద్రాలకు కారణం ఒక ఎలుక అనే విషయం మనకి తెలియను కూడా తెలియదు. ఈ కథ ఎవరికోసం అంటే.. పని పాటా లేకుండా ఉన్నవారికి లేదా జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నవాళ్లకి.. మీరందరూ తప్పనిసరిగా ఈ కథని తప్పకుండా వినాలి. వినడమే కాదు.. ఒక వ్రతం లాగా 10 మందితో ఈ కథని పంచుకోవాలి. ఫార్వార్డ్ చేసుకోవాలి.." అని పూరి స్వామిజీల గురించి చెప్పుకొచ్చారు.