పుట్టిన ఊళ్లో అస్సలు ఉండవద్దని, కడుపు నిండిన వాడి పక్కన కూర్చోవద్దని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ.. తాజాగా `వేట` గురించి మాట్లాడారు.
`మంగళవారం మంచిది కాదు అని ఓ కుక్కని కన్విన్స్ చెయ్యలేం. శ్రావణ శుక్రవారం స్నానం చేస్తే స్వర్గానికి వెళతావని ఓ కోతికి నచ్చచెప్పలేం. ప్రపంచంలో ఏ జంతువూ కల్పిత కథలను నమ్మదు. జంతువులు వాస్తవాలనే నమ్ముతాయి. కానీ, బూదిద పూస్తే దెయ్యం రాదు అంటే మనం నమ్ముతాం. ఈ రాయిని లోపల పెట్టుకుంటే ప్రపంచాన్ని ఏలతావు అంటే నమ్ముతాం. మనిషి వేటగాడిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఏడు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభించాడు. వేట మానేశాడు. ఇంటి చుట్టూ పంట. చేతిలో కంచం. పని తగ్గింది. కల్పిత కథలు మొదలయ్యాయి. వాటిని వినడమే కాదు నమ్మడం కూడా మొదలెట్టాడు. అప్పుడే అన్ని దరిద్రాలూ చుట్టుకున్నాయి. తర్వాత దేవుడు పుట్టాడు. మతం పుట్టింది. నమ్మకాలు మొదలయ్యాయి. వాటి మధ్య పెరిగాం. ప్రశ్నించే ధైర్యం లేదు. నలుగురితో నారాయణ.. గుంపుతో గోవింద. కంచంలోకి ఉచితంగా భోజనం వచ్చినన్ని రోజులూ ఇలాగే ఉంటుంది. వేటగాడెప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. మీరు వేట మానొద్దు. మీ ఊళ్లో ఉండొద్దు. కడుపు నిండిన వాడి పక్కన అస్సలు కూర్చోవద్ద`ని పూరీ పేర్కొన్నారు.