కష్టమైనా సరే ఇష్టమైనే పనే చేయాలని, అలా చేస్తే ప్రతి రోజూ సెలవులాగానే ఉంటుందని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం ఆయన `పూరీ మ్యూజింగ్స్` పేరుతో పలు అంశాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా `వర్క్` గురించి మాట్లాడారు.
`పేదవాడైనా, ధనవంతుడైనా స్వయంగా చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి. నిద్ర, ఆహారం మొదలైన వాటి కోసం పనివాళ్లను పెట్టుకోలేం. ఇవి కాకుండా బతకడానికి చేసే పనులు కొన్ని ఉంటాయి. చాలా మందికి పని చేయాలంటే బద్దకం. తిట్టుకుంటూ ఆఫీస్కు వెళతారు. శని, ఆదివారాల కోసం ఎదురుచూస్తుంటారు. 90 శాతం మంది ప్రజలు తమకు ఇష్టం లేని ఉద్యోగాలే చేస్తుంటారు. ఇష్టం లేకుండా పనిచేసే వాళ్లంతా నటులు. ఇలాంటి నటులను ఉద్యోగంలో పెట్టుకున్న యజమాని సమస్యలు ఎదుర్కొంటాడు. అందుకే కష్టమైనా సరే ఇష్టమైన పనే చేయండి. మీ ఆఫీస్ మీకు ప్లే గ్రౌండ్లా అనిపించాలి. ఇష్టమైన పని చేస్తే మీరు మరింత క్రియేటివ్గా మారతారు. `ఉద్యోగం మానేస్తా` సర్ అంటే.. యజమాని బతిమాలేలా ఉండాలి తప్ప.. `సరే.. వెళ్లండి` అనేలా ఉండకూడదు. ఇష్టమైన పనిలో ఉంటే జీవితాంతం పనిచెయ్యనక్కర్లేదు. ప్రతి రోజూ సెలవేన`ని పూరీ పేర్కొన్నారు.