పుట్టపర్తి జిల్లా కేంద్రం కాదట...!
ABN , First Publish Date - 2022-06-25T05:39:02+05:30 IST
ఏపీలో నూతన జిల్లాల విభజనలో భాగంగా అనంతపురం జిల్లా కేంద్ర ప్రభుత్వ శాఖలను రెండుగా విభజించి, ఒక భాగం కార్యాలయాలను పుట్టపర్తికి తరలించారు.
అనంత నుంచి పుట్టపర్తికి బదిలీ అయిన ఉద్యోగుల హెచఆర్ఏ కోత
16కు గాను పది శాతమే చెల్లింపు
లబోదిబోమంటున్న ఉద్యోగ వర్గాలు
అనంతపురం సెంట్రల్, జూన 24: ఏపీలో నూతన జిల్లాల విభజనలో భాగంగా అనంతపురం జిల్లా కేంద్ర ప్రభుత్వ శాఖలను రెండుగా విభజించి, ఒక భాగం కార్యాలయాలను పుట్టపర్తికి తరలించారు. ఇందులో భాగంగా ఆయాశాఖల అధికారులు, ఉద్యోగులను 50శాతం మందిని పుట్టపర్తికి బదిలీచేశారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన వారికి జిల్లా కేంద్రానికి వర్తించే హెచఆర్ఏలో ప్రభుత్వం కోతపెట్టింది. వేతనంలోని బేసిక్ పేకు 16శాతం హెచఆర్ఏ చెల్లించాల్సి ఉండగా 10శాతం మాత్రమే చెల్లిస్తోందని బాధిత ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే పుట్టపర్తి.. మండల స్థాయి ప్రాంతమని అందుకే పదిశాతం హెచఆర్ఏ ఇస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయా వర్గాలు వాపోతున్నాయి. 11వ పీఆర్సీ ప్రకారం జిల్లా కేంద్రంలో పనిచేసేవారికి 16శాతం, మండల ప్రాంతాల్లోని వారికి 10శాతం చొప్పున ప్రభుత్వం హెచఆర్ఏ నిర్ణయించింది. ఆ మేరకు ఒక జిల్లా కేంద్రం నుంచి మరొక జిల్లా కేంద్రానికి బదిలీ అయిన వారికి 16శాతం హెచఆర్ఏను చెల్లించాలి. జిల్లా కేంద్రం ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం 20శాతం చెల్లించేది. అయితే వైసీపీ ప్రభుత్వం 20 నుంచి 16 శాతానికి తగ్గించడమే కాకుండా పదిశాతమే చెల్లిస్తోందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. పుట్టపర్తికి బదిలీ అయిన పాపానికి ఆరుశాతం హెచఆర్ఏను కోల్పోతున్నామని వారు లబోదిబోమంటున్నారు.
హెచఆర్ఏలో సీలింగ్ ఫిట్టింగ్.. : ఉద్యోగి అనుభవం, స్థాయిని బట్టిని బేసిక్ పే ఉంటుంది. 12నెలలకు ఒకసారి ఇంక్రిమెంట్ పొందినప్పుడల్లా బేసిక్ పే మొత్తం పెరుగుతుంది. ఆ మేరకు టీడీపీ ప్రభుత్వంలో శ్లాబులు వారిగా హెచఆర్ఏ అందేది. జిల్లా కేంద్రంలోని ఉద్యోగులకు 20శాతం, తాలూకా స్థాయిలోని వారికి 14శాతం, మండల ప్రాంత ఉద్యోగులకు 12శాతం హెచఆర్ అందేది. అయితే వైసీపీ ప్రభుత్వం తొలిసారి 11వ పీఆర్సీలో సరాసరి 8శాతంగా నిర్ణయించింది. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు రోడ్లెక్కడంతో దిగివచ్చిన సర్కార్ శ్లాబుల శాతాన్ని నిర్ణయించింది. గత ప్రభుత్వంలోని హెచఆర్ను తగ్గిస్తూ 20కి 16శాతం, 14కి 12శాతం, 12కిగాను 10శాతంగా చెల్లిస్తామని చెప్పిన సర్కార్ సీలింగ్ ఫిట్టింగ్ పెట్టింది. రూ.1.5లక్షల బేసిక్ పే ఉన్న జిల్లా కేంద్ర ఉద్యోగులకు 16శాతం మేరకు రూ.24వేల హెచఆర్ఏ చెల్లించాలి. సీలింగ్ మూలాన రూ.17వేలు చెల్లించి మిగిలిన రూ.7వేలు గండికొట్టింది. ఇలా 16శాతానికి రూ.17వేలు. 12శాతానికి రూ.13వేలు. పదిశాతానికి రూ.11వేలు చెల్లించి అన్యాయం చేస్తోందని బాధిత ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఒకవైపు సీలింగ్. మరోవైపు పుట్టపర్తిని మండల ప్రాంతంగా పరిగణిస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అనంత నుంచి పుట్టపర్తి బదిలీ అయిన ఉద్యోగులు వాపోతున్నారు.