సింధుకు పతకం ఖాయం

ABN , First Publish Date - 2022-04-30T09:54:48+05:30 IST

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప సెమీఫైనల్‌కు దూసుకుపోయింది.

సింధుకు పతకం ఖాయం

సెమీస్‌లో భారత స్టార్‌

సాత్విక్‌ జోడీ ఓటమి

ఆసియా బ్యాడ్మింటన్‌ 

మనీలా (ఫిలిప్పీన్స్‌): రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. తద్వారా ఆమె కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లో పరాజయంతో టోర్నమెంట్‌నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో అద్భుతంగా పోరాడిన నాలుగో సీడ్‌ సింధు 21-19, 13-21, 21-19తో ఐదో సీడ్‌ హే బింగ్జియావో (చైనా)ను చిత్తు చేసింది. 26 ఏళ్ల సింధు.. శనివారం జరిగే సెమీస్‌లో జపాన్‌కు చెందిన టాప్‌ సీడ్‌ అకానె యమగూచితో తలపడనుంది. 2014 చాంపియన్‌షి్‌పలో సింధు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈసారి చక్కని ఆటతో పతకాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యమగూచితో ముఖాముఖి రికార్డులో 13-8తో పైచేయిలో ఉన్న సింధు.. ఆమెపై చివరిసారిగా నిరుడు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో విజయం సాధించింది. ఇక.. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి జంట 21-12, 14-21, 16-21తో ఐదో సీడ్‌, మలేసియా జంట అరోన్‌ చియా/సో వూ ఇక్‌ చేతిలో పరాజయంపాలైంది. యాభై మూడు నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్‌ నెగ్గిన సాత్విక్‌ జోడీ తర్వాతి రెండు గేముల్లో అదే జోరును కనబర్చడంలో విఫలమై నిష్క్రమించింది.

Updated Date - 2022-04-30T09:54:48+05:30 IST