కరోనా.. కంగారు..
ABN , First Publish Date - 2021-04-24T05:13:40+05:30 IST
వేగంగా విస్తరిస్తున్న కరోనా ప్రజలను కంగారెత్తిస్తోంది.
వ్యాక్సిన్ కోసం పరుగులు
ఆస్పత్రి వద్ద గుంపులుగా జనం
జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 23 : వేగంగా విస్తరిస్తున్న కరోనా ప్రజలను కంగారెత్తిస్తోంది. నిన్న, మొన్నటి వరకు కరోనా వ్యాక్సిన్ వేయించుకునేం దుకు వెనుకడుగు వేసిన వారంతా నేడు పరుగులు పెడుతున్నారు. ఎక్కువ మంది వ్యాక్సిన్ కోసం ఎగబడడంతో రాజకీయ నేతలు, అధికారుల సిఫారసు చేయాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం 150 డోస్ల వేక్సినేషన్ వేశారు. సచివాలయ సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా ఆసుపత్రికి తరలివచ్చారు. బీపీ, షుగర్, ఆయాసం వంటి సమస్యలతో గంటల పాటు క్యూలైన్లో నుంచుంటే కొంత మంది దర్జాగా వచ్చి నేరుగా వ్యాక్సిన్ వేసుకుంటున్నారని, అక్కడున్న సిబ్బందికి తెలిసిన వారికే ముందు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో క్యూలైన్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. భౌతిక దూరం పాటించకుండా అందరూ గుమిగూడడంతో కొందరు వెనుదిరిగారు.
భయం.. భయం..
పట్టణంలో గడచిన మూడు రోజులుగా రోజుకు ముగ్గురు, నలుగురు మృత్యువాత పడినట్లు తెలియడంతో పట్టణ ప్రజలు భయపడుతున్నారు. వారిది సహజ మరణమా, లేదా కరోనా కారణంగా మృతి చెందారా అని భయాందోళన చెందుతున్నారు. దీనికితోడు పట్టణంలో కరోనా బాధితులు పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.